లోన్ల పేరుతో డబ్బులు కొట్టేసిన్రు

లోన్ల పేరుతో డబ్బులు కొట్టేసిన్రు
  • వనపర్తికి చెందిన సైబర్ ముఠా అరెస్ట్
  • ముద్ర, ధని లోన్స్ కోసం అప్లై చేసిన వాళ్లే టార్గెట్
  • లోన్ సాంక్షన్ చేస్తామంటూ ఫీజులు వసూలు
  • వివరాలు వెల్లడించిన సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్

హైదరాబాద్‌‌‌‌‌‌, వెలుగు: ముద్ర, ధని లోన్‌‌‌‌‌‌, పీఎం విశ్వకర్మ లోన్ల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఎనిమిది మంది సైబర్ నేరగాళ్ల ముఠాను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 26 ఫోన్లు, నాలుగు బైక్​లు స్వాధీనం చేసుకున్నారు. సైబర్ నేరాలకు వినియోగించిన ఫోన్ నంబర్స్, బ్యాంక్ అకౌంట్లపై దేశవ్యాప్తంగా 55 ఎఫ్ఐఆర్​లు, నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (ఎన్​సీఆర్​పీ)లో 373 ఫిర్యాదులు ఉన్నట్లు సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు గుర్తించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ ప్రకటనలో వెల్లడించారు.

వనపర్తి జిల్లా కొత్తకోట టౌన్‌‌‌‌కు చెందిన ఓ వ్యక్తి రూ.లక్ష కోసం పీఎం విశ్వకర్మ కమ్యూనిటీ వర్క్‌‌‌‌ లోన్‌‌‌‌ కింద జనవరి 11న లోకల్ మీ సేవా సెంటర్‌‌‌‌‌‌‌‌ లో అప్లై చేసుకున్నాడు. తర్వాత అదేరోజు అతని వాట్సాప్‌‌‌‌కు గుర్తుతెలియని నంబర్ నుంచి మేసేజ్ వచ్చింది. ఫోన్‌‌‌‌ పే, గూగుల్‌‌‌‌ పే ద్వారా లోన్ సాంక్షన్ చేసేందుకు ఫీజ్‌‌‌‌ చెల్లించాలని సూచించారు. దీంతో గూగుల్‌‌‌‌ పే ద్వారా రూ.3,750, ఫోన్‌‌‌‌ పే ద్వారా రూ.8,500 మొత్తం రూ.12,250 బాధితుడు ట్రాన్స్‌‌‌‌ఫర్ చేశాడు. ఆ తర్వాత మళ్లీ రూ.9 వేలు చెల్లించాలని చెప్పారు. బాధితుడు డబ్బులు చెల్లించేందుకు నిరాకరించాడు. అనుమానం వచ్చి కాల్‌‌‌‌ చేశాడు. ఎలాంటి స్పందన లేకపోవడంతో మోసపోయానని గుర్తించాడు. 1930 ద్వారా ఫిర్యాదు చేశాడు.

తెలుగు మాట్లాడే వారే టార్గెట్

బాధితుడు అందించిన ఫోన్ నంబర్స్‌‌‌‌, పేమెంట్‌‌‌‌ గేట్‌‌‌‌ వేస్‌‌‌‌ ద్వారా డబ్బులు ట్రాన్స్‌‌‌‌ఫర్ అయిన అకౌంట్స్ ను బట్టి సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. లోన్ ఇస్తామంటూ ఇలాంటి మోసాలకు సంబంధించిన కేసులు పరిశీలించారు. తెలుగు మాట్లాడే వారినే టార్గెట్‌‌‌‌ చేసి ముద్ర, ధని లోన్స్ పేరుతో మోసాలు చేస్తున్నట్లు గుర్తించారు. ఫోన్‌‌‌‌ నంబర్స్‌‌‌‌, బ్యాంక్ అకౌంట్స్ ఆధారంగా వనపర్తి జిల్లా నుంచే మోసాలు చేస్తున్నట్లు ఆధారాలు సేకరించారు.

కొత్తకోట పోలీసులతో కలిసి జాయింట్ ఆపరేషన్ చేశారు. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం బలిపల్లి ఎర్రగుట్ట తండాకు చెందిన వర్తియవత్‌‌‌‌ నర్సింగ్‌‌‌‌ (32), ఎస్లావత్‌‌‌‌ రాములు(32), ఎస్లావత్ సూరజ్ (18), వర్తియవత్‌‌‌‌ ప్రవీణ్‌‌‌‌(18), జంగమిపల్లికి చెందిన పోతులపల్లి కురుమూర్తి (28)తో పాటు నాగర్ కర్నూల్‌‌‌‌ జిల్లా గంగరం పెద్ద తండాకు చెందిన రత్‌‌‌‌లవత్‌‌‌‌ రమేష్‌‌‌‌ (32), అనంతపూర్‌‌‌‌‌‌‌‌కు చెందిన కొత్తపల్లి ఉమేశ్(25), బోయ వీరేశ్​(24)ను అరెస్ట్‌‌‌‌ చేశారు.