
సైబర్ నేరగాళ్లు రోజుకో రకం స్కాంతో సామాన్యులను దోచుకుంటున్నారు. అధిక లాభాల ఆశ చూపి సామాన్యుల సొమ్ము కొల్లగొడుతున్నారు కేటుగాళ్లు. ప్రభుత్వాలు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ కేటుగాళ్ల వలకు చిక్కేవారి సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా మెదక్ జిల్లాలో సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. షేర్ మార్కెట్ పేరుతో ఓ వ్యక్తి నుంచి రూ. 98 వేలు కాజేశారు కేటుగాళ్లు. జిల్లాలోని తూప్రాన్ కి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి షేర్ మార్కెట్ లో లాభాలు వచ్చాయంటూ ఫోన్ చేశారు కేటుగాళ్లు.
రూ. పదివేలు పెడితే రూ. 75 వేలు ఇస్తామంటూ సైబర్ నేరగాళ్లు చెప్పిన మాయమాటలు నమ్మి మోసపోయాడు శ్రీనివాస్. డబ్బులు అకౌంట్లో పడాలంటే ముందుగా జీఎస్టీ కట్టాలని, కరెంట్ అకౌంట్ గా మార్చాలని పలు దఫాలుగా శ్రీనివాస్ నుంచి డబ్బులు రాబట్టారు సైబర్ నేరగాళ్లు. కేటుగాళ్ల మాటలు నమ్మి రూ. 98 వేలు పంపాడు శ్రీనివాస్.
డబ్బులు తిరిగి రాకపోవడంతో మోసపోయానని గ్రహించిన శ్రీనివాస్ 1930కి కాల్ చేశాడు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేశాడు. శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ కేసు నమోదు చేశారు పోలీసులు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని.. అధిక లాభాలు అంటూ వచ్చే ఫోన్ కాల్స్ ని మోసపోవద్దని సూచించారు పోలీసులు.