- ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గుర్తించలేనంతగా ట్రిక్కీ ప్రాంప్ట్స్ ఇంజెక్ట్
- కంపెనీల భద్రతకే పెను సవాల్గా మారిన మలీషియస్ ప్రాంప్ట్స్
- ఢిల్లీ, ముంబైలో వెలుగు చూసిన ఈ తరహా నేరాలు
ఏఐ మోడల్స్, చాట్బోట్లను వినియోగించే సంస్థల కీలక డేటాను దొంగిలించేందుకు సైబర్ నేరగాళ్లు కొత్త ఎత్తులు వేస్తున్నారు. ‘ప్రాంప్ట్ ఇంజెక్షన్’ మాల్వేర్ను వాడుతూ ఈ కామర్స్, స్టార్టప్స్ సహా ఆన్లైన్ కంపెనీల రహస్య సమాచారాన్ని కొల్లగొడుతున్నారు.
హైదరాబాద్, వెలుగు: ఏఐ మోడల్స్, చాట్బోట్లను వినియోగించే సంస్థల కీలక డేటాను దొంగిలించేందుకు సైబర్ నేరగాళ్లు కొత్త ఎత్తులు వేస్తున్నారు. ‘ప్రాంప్ట్ ఇంజెక్షన్’ మాల్వేర్ను వాడుతూ ఈ కామర్స్, స్టార్టప్స్ సహా ఆన్లైన్ కంపెనీల రహస్య సమాచారాన్ని కొల్లగొడుతున్నారు. ఏఐ వాడకం పెరిగాక చిన్న స్టార్టప్ల నుంచి మల్టీ నేషనల్ కంపెనీల వరకు అంతా ఇప్పుడు ‘ఏఐ చాట్బోట్’లనే వాడుతున్నారు.
వినియోగదారుల సందేహాలకు క్షణాల్లో సమాధానాలివ్వడం, పనిలో వేగం పెంచి.. ఖర్చు తగ్గించడంలాంటి ప్రయోజనాలు ఉండడంతో కంపెనీలన్నీ ఈ వైపే మొగ్గుచూపుతున్నాయి. వీటికి ఇప్పుడు ‘ప్రాంప్ట్ ఇంజెక్షన్’ గండం పొంచి ఉన్నది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా గుర్తించలేని విధంగా ఒకే ఒక్క ట్రిక్కీ ప్రాంప్ట్స్ ను ఇంజెక్ట్ చేస్తూ సైబర్నేరగాళ్లు.. డేటా చౌర్యానికి పాల్పడుతున్నారు. కంపెనీల భద్రతను ప్రశార్థకం చేస్తున్నారు.
‘ప్రాంప్ట్ ఇంజెక్షన్’ అంటే?
సాధారణంగా ఏఐ పని చేయడానికి మనం ఇచ్చే ఆదేశాలను ‘ప్రాంప్ట్’ అంటారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత మనకు కావాల్సిన ఎలాంటి సమాచారమైనా సరే ఒక్క క్లిక్తో అరచేతిలో ఉంటున్నది. యూజర్లు ఇచ్చే ప్రాంప్ట్ ఆధారంగానే ఏఐ తగిన సమాచారం అందిస్తున్నది. ఇదే ప్రాంప్ట్ను సైబర్ నేరగాళ్లు టార్గెట్గా చేసుకున్నారు. ఏఐ మోడల్ను తప్పుదోవ పట్టించేలా, ట్రిక్ చేసేలా ‘మలీషియస్ ప్రాంప్ట్స్’ ఇస్తున్నారు.
ఏఐని మాటలతో మాయ చేస్తున్నారు. సాధారణంగా బయటపెట్టకూడని సంస్థల సీక్రెట్పేపర్లు, కస్టమర్ల రికార్డులు, సిస్టమ్ వివరాలను రాబడుతున్నారు. ఇలాంటి నేరాలు ఢిల్లీ, ముంబైలో వెలుగు చూడడంతో ప్రాంప్ట్ ఇంజెక్షన్ పట్ల అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సీపీ సజ్జనార్, సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఏఐని కన్ఫ్యూజ్ చేస్తున్నరు..
సైబర్ నేరగాళ్లు ఏఐ కూడా గుర్తించ లేనంతగా స్వల్ప మార్పులతో ‘ప్రాంప్ట్ ఇంజెక్ట్’ చేస్తున్నారు. ఏఐ మోడల్ను తప్పుదోవ పట్టించేలా ‘మలీషియస్ ప్రాంప్ట్స్’ (మాల్వేర్ జోడించిన ఆదేశాలు) ఇస్తున్నారు. అత్యంత దగ్గరి సంబంధం ఉన్న వివరాలతో ఏఐని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఇలాంటి ట్రిక్కీ ప్రాంప్ట్ను కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫాలో అవుతున్నది. ఈ క్రమంలోనే సీక్రెట్ డేటా, డాక్యుమెంట్లు, ఈ కామర్స్ సైట్లకు సంబంధించిన కస్టమర్ల రికార్డులు సహా ప్రాంప్ట్ ఇంజెక్షన్ అటాక్ ద్వారా ఎంటర్ చేసిన పూర్తి డేటా సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్తున్నది. సంస్థల్లోని కీలకమైన డేటా సిస్టమ్ల ఎండ్ యూజర్కు ఈ సమాచారం పొరపాటున కూడా కనిపించకూడదు. కానీ, హ్యాకర్లు వేసే ఒకే ఒక్క ‘ట్రిక్కీ ప్రాంప్ట్’ వల్ల ఈ గోప్య సమాచారమంతా బయటపడుతున్నది.
అప్రమత్తంగా ఉండాలి..
ఏఐలో ‘ప్రాంప్ట్ ఇంజెక్షన్’ చేయడం ద్వారా పలు రాష్ట్రాల్లో కంపెనీలు డేటాను కోల్పోయాయి. దీని ద్వారా సైబర్ నేరగాళ్లు కంపెనీల రికార్డులు మార్చే ప్రమాదం ఉన్నది. రహస్య డేటా సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్తే దుర్వియోగం అవుతుంది. ఏఐతో కార్యకలాపాలు నిర్వహించే సంస్థలు అప్రమత్తంగా ఉండాలి. పటిష్టమైన సైబర్ సేఫ్టీ టూల్స్ను వినియోగించాలి.
– వీసీ సజ్జనార్, సీపీ, హైదరాబాద్
