హైదరాబాద్ లో ఆ 15 నిమిషాల్లోనే రోడ్లపైకి 2 లక్షల వాహనాలు... 

హైదరాబాద్ లో ఆ 15 నిమిషాల్లోనే రోడ్లపైకి 2 లక్షల వాహనాలు... 
  • స్కూల్స్ , వివిధ క్యాంపస్​ లు ముగిసే టైంలోనే వెల్లువ  
  • ఐటీ కారిడార్​లో కంటే ఎక్కువ 
  • నివారణ కోసం స్టూడెంట్ మొబిలిటీ ప్లాన్: సైబరాబాద్​ సీపీ రమేశ్

గచ్చిబౌలి, వెలుగు : స్కూల్స్​ముగిసే టైంలో కేవలం15 నిమిషాల వ్యవధిలోనే సైబరాబాద్ వ్యాప్తంగా వివిధ క్యాంపస్‌‌‌‌ల నుంచి సమారు 2 లక్షల వాహనాలు రోడ్లపైకి వస్తున్నాయని, ఈ రద్దీ సైబరాబాద్ ఐటీ కారిడార్‌‌‌‌లో పీక్ అవర్స్‌‌‌‌లో ఉండే ట్రాఫిక్ కంటే ఎక్కువగా ఉంటోందని సైబరాబాద్​ సీపీ రమేశ్​తెలిపారు. గచ్చిబౌలి ఇంజనీరింగ్​ స్టాఫ్​ కాలేజీ శతాబ్ది కన్వెన్షన్ సెంటర్‌‌‌‌లో కమిషనరేట్, ఎస్‌‌‌‌సీఎస్‌‌‌‌సీ సంయుక్తంగా నిర్వహించిన అవగాహన సదస్సు నిర్వహించారు. 

దీనికి 500 విద్యాసంస్థలకు చెందిన 750 మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు. సీపీ రమేశ్​మాట్లాడుతూ ఎడ్యుకేషన్​ఇన్​స్టిట్యూషన్స్​లో  విద్యార్థుల రవాణా సమస్యలను పరిష్కరించడానికి, ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి స్టూడెంట్ మొబిలిటీ ప్లాన్ రూపొందించినట్టు చెప్పారు. సైబరాబాద్ పోలీస్ అండ్​సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ 526 విద్యాసంస్థల్లో సర్వే చేయగా అనేక సమస్యలు బయటపడ్డాయన్నారు. 

వీటికి పరిష్కారంగా స్కూల్స్​, రవాణా ఆపరేటర్లు, పేరెంట్స్​, సివిల్​అథారిటీస్​ను ఒకే వేదికపైకి తీసుకువచ్చేలా ఒక టెక్నికల్​ప్లాట్‌‌‌‌ఫామ్​ను సిద్ధం చేశామన్నారు. ఇందులో పిల్లల భద్రతకు, సాఫీగా సాగే ట్రాఫిక్ కదలికలకు సమాన ప్రాధాన్యత ఉంటుందన్నారు. లాస్ట్-మైల్ కనెక్టివిటీ కోసం గిగ్ వర్కర్లు, ఆశా కార్యకర్తలు, అంగన్‌‌‌‌వాడీ కార్యకర్తలకు భాగస్వామ్యం కల్పిస్తామని తెలిపారు. 

కొద్ది మందే ఆ ఫెసిలిటీ వాడుకుంటున్నరు..

ఎస్‌‌‌‌సీఎస్‌‌‌‌సీ సీఈఓ నవేద్ ఖాన్ మాట్లాడుతూ దాదాపు 80 శాతం విద్యాసంస్థలు ట్రాన్స్​పోర్ట్​సౌకర్యాన్ని కల్పిస్తుండగా, 30 శాతం మంది మాత్రమే ఆ సేవలను వినియోగించుకుంటున్నారు. మిగిలిన వారు సొంత వాహనాల్లో ప్రయాణిస్తుండడంతో ట్రాఫిక్​జామ్స్, రద్దీ ఏర్పడుతోందన్నారు. 

శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ నారాయణ అమిత్​, కూకట్‌‌‌‌పల్లి డీసీపీ రితిరాజ్, ఉమెన్ సేఫ్టీ వింగ్ డీసీపీ సృజన, ట్రాఫిక్ డీసీపీ శేషాద్రిని రెడ్డి,  కూకట్‌‌‌‌పల్లి జెడ్సీ మయాంక్ సింగ్, టీజీఆర్‌‌‌‌టీసీ డిప్యూటీ రీజినల్ మేనేజర్ అపర్ణ కల్యాణి, ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా  డైరెక్టర్ రామేశ్వరరావు పాల్గొన్నారు.