న్యూఢిల్లీ: అసాధారణ బ్యాటింగ్ నైపుణ్యంతో ప్రపంచ క్రికెట్ను ఏలుతున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో అరుదైన గుర్తింపును పొందాడు. 11 ఏళ్ల కెరీర్ పూర్తిచేసుకున్న సందర్భంగా ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఎ) ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా స్టేడియంలోని ఓ స్టాండ్కు విరాట్ పేరును పెట్టింది. స్టేడియంలో రెండు స్టాండ్స్కు ఇప్పటికే బిషన్ సింగ్ బేడీ, మొహిందర్ అమర్నాథ్ పేర్లు పెట్టారు. అయితే ఈ ఇద్దరు రిటైర్ అయిన తర్వాత వాళ్లకు ఈ గౌరవం దక్కింది. కానీ విరాట్.. యంగెస్ట్ యాక్టివ్ క్రికెటర్గా ఈ ఘనతను సొంతం చేసుకున్నాడు. ‘వరల్డ్ క్రికెట్కు కోహ్లీ అందిస్తున్న సేవలకు డీడీసీఏ గర్వపడుతోంది. కెరీర్లో అతను సాధించిన మైలురాళ్లు, కెప్టెన్సీ రికార్డులను దృష్టిలో పెట్టుకుని పేరు పెట్టాలని నిర్ణయించాం. విరాట్ కోహ్లీ స్టాండ్ కచ్చితంగా యువ క్రికెటర్లకు స్ఫూర్తినిస్తుంది’ అని డీడీసీఏ అధ్యక్షుడు రజత్ శర్మ వ్యాఖ్యానించాడు.
