Diwali Special : దీపావళి హిందూవులదే కాదు అందరిదీ.. మిగతా మతాల్లోని దీపావళి ఆచారాలు ఇవే..!

Diwali Special : దీపావళి హిందూవులదే కాదు అందరిదీ.. మిగతా మతాల్లోని దీపావళి ఆచారాలు ఇవే..!

దీపావళి పండుగ.. చిన్నా పెద్ద తేడా లేకుండా అందరూ దీపాలు వెలిగించి, పటాసులు పేలుస్తూ ఆనందంగా జరుపుకునే పండుగ. స్వీట్స్ పంచి సంతోషాన్ని షేర్ చేసుకునే పండుగ. ఈ పండుగకు పురాణ, చారిత్రక సంబంధం ఉంది. హిందువులే కాకుండా ఇతర మతాలవాళ్లూ దీనిని ప్రత్యేకంగా జరుపుకుంటారు

పు రాణాల ప్రకారం సత్యభామ, కృష్ణుడు నరకాసురుడనే రాక్షసుడ్ని చంపడంతో ప్రజలు ఆనందంతో దీపాలు వెలిగించి పండుగ చేసుకున్నారని చెప్తారు. రాముడు అయోధ్యకు తిరిగి వచ్చిన రోజూ దీపావళి అని అంటారు. అయితే, ఈ పండుగకు మరికొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. కేవలం హిందువులే కారు బౌద్దులు, జైనులు, సిక్కులు అనేక మతాల వాళ్లూ ఈ పండుగను జరుపుకుంటారు. ఎందుకంటే.. దీపావళికి వాళ్లకు ముడిపడిన చారిత్రక సంఘటనలు, సందర్భాలు ఉన్నాయి.

బౌద్దులు :  దీపావళి బౌద్దుల పండుగ కాదు. అయినా బౌద్ధమతంలో 'వజ్రయాన శాఖకు చెందిన వాళ్లు మాత్రం ఈ పండుగను జరుపుకుంటారు. ముఖ్యంగా నేపాల్లో ఉన్ని 'నేవార్' ప్రజలు దీపావళిని చేసుకుంటారు. లక్ష్మీదేవిని దేవతగా భావించి ప్రార్థిస్తారు. హిందువుల్లాగే నేవాల్లోని బౌద్ధులు అయిదు రోజులపాటు దీపావళి, తిహార్' పేరిట పండుగ జరుపుకుంటారు. నిజానికి వారి ఆచారం ప్రకారం ప్రపంచ స్వేచ్ఛకోసం ఏ దేవతనైనా ఆరాధించొచ్చు. ఆ విధంగా నేవార్ బౌద్ధులు లక్ష్మీదేవిని, విష్ణువును ప్రార్థించి పూజలు చేస్తున్నారన్నది పరిశోధకుల అభిప్రాయం. 

జైనులు:  జైనులు వాళ్ల గురువు మహావీరుడు నిర్యాణం  పొందిన రోజున దీపావళి జరుపుకుంటారు. వాళ్లు వెలిగించిన దీపాల కాంతిన మహావీరునికి అంకితంగా భావిస్తారు. అలాగే జైన సంప్రదాయం ప్రకారం 18మంది రాజులు మహావీరుని చివరి బోధనలను సేకరించి ప్రకాశవంతమైన కాంతి, మహావీర పేరుతో భద్రపరచారు. అందుకే దీపావళి పండుగను జైనులు అతని జ్ఞాపకంగా, బోధనలను గుర్తుచేసుకునే రోజుగా చేసుకుంటారని చెప్తారు. వీళ్ల సంప్రదాయం ప్రకారం వ్యాపారస్తులు కొత్త లెక్కలను దీపావళి రోజు నుంచే మొదలుపెడతారు.

సిక్కులు :  దీపావళి పండుగకు సిక్కులకు చాలా దగ్గ సంబంధం ఉంది.   సిక్కుల మూడో గురువు అమర్​ దాస్​  దీపావళి పండుగ గురించి చెప్పాడు. చెప్పటమే కాదు... గోయిద్వాల్ దగ్గర 84 మెట్లతో బావిని నిర్మించి, సిక్కులను ఆ పవిత్ర జలంతో శుద్ధి చేశాడు. క్రమంగా ఆ ఉత్సవం వాళ్ల పండుగలా, ఆచారంగా మారింది. గురువు ఆశీర్వాదం పొందేటప్పుడు తప్పనిసరిగా దీపాలు వెలిగించాలని అమర్​ దాస్ బోధించాడు. దీపావళి పండుగను సిక్కులు  జరుపుకోవడానికి ప్రధానంగా మూడు కారణాలున్నాయి. దీపావళి రోజు వాళ్ల గురువు హరగోవింద్, అతనితోపాలు 52 మంది సిక్కులు గ్వాలియర్ జైలు నుంచి విడుదలయిన రోజు...  అలాగే 1577లో  అమృతసర్ లోని స్వర్ణదేవాలయానికి శంఖుస్థాపన జరిగింది దీపావళి రోజే. ... 1738లో భాయ్ మణిసింగ్, దీపావళి జరుపుకునేందుకు జరిమానా చెల్లించలేక. మతం మార్చుకునేందుకు ఇష్టపడక బలిదానం అయ్యాడు. 

ఆర్యసమాజం :  సంఘసంస్కర్త దయానంద సరస్వతి హిందూమతంలోని మూఢనమ్మకాలు, అంటరానితనం...  సతీసహగమనం... : బాల్య వివాహాలు లాంటి దురాచాకాలను పోగొట్టాలని 1875 ఏప్రిల్ 10న ఆర్యసమాజాన్ని స్థాపించాడు. అతని బోధనలు నచ్చి చాలామంది ఆరోజుల్లో ఆయనను అనుసరించారు. అయితే దయానంద సరస్వతి 1883లో దీపావళి రోజునే పోయాడు. అందుకు గుర్తుగా ఆర్యసమాజ సిద్ధాంతాలను పాటించే వాళ్లు దీపావళిని ప్రత్యేకమైన రోజుగా భావిస్తారు.