
- ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 136కే ఆలౌట్
- ఇండియా రెండో ఇన్నింగ్స్లో 186/6
- రాణించిన హర్మన్, షెఫాలీ
నవీ ముంబై: ఇంగ్లండ్ విమెన్స్తో జరుగుతున్న ఏకైక టెస్ట్లో ఇండియా భారీ ఆధిక్యం దిశగా సాగుతోంది. స్టార్ స్పిన్నర్ దీప్తి శర్మ (5/7) స్పిన్ మ్యాజిక్ చేయడంతో.. శుక్రవారం రెండో రోజు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 35.3 ఓవర్లలో 136 రన్స్కే కుప్పకూలింది. సివర్ బ్రంట్ (59) మినహా మిగతా వారు ఫెయిలయ్యారు. తర్వాత బ్యాటింగ్కు దిగిన ఇండియా ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్లో 42 ఓవర్లలో 186/6 స్కోరు చేసింది. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (44 బ్యాటింగ్), పూజా వస్త్రాకర్ (17 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. షెఫాలీ వర్మ (33) రాణించింది. అంతకుముందు 410/7 ఓవర్నైట్ స్కోరుతో ఆట కొనసాగించిన ఇండియా తొలి ఇన్నింగ్స్లో 104.3 ఓవర్లలో 428 రన్స్కు ఆలౌటైంది. దీప్తి శర్మ (67) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నా.. పూజా వస్త్రాకర్ (10 నాటౌట్), రేణుకా సింగ్ (1), రాజేశ్వరీ గైక్వాడ్ (0) ఫెయిలయ్యారు. ఎకిల్స్టోన్, లారెన్ బెల్ చెరో మూడు వికెట్లు తీశారు. ఓవరాల్గా 292 రన్స్ ఫస్ట్ ఇన్నింగ్స్ లీడ్ను కలుపుకుని ఇండియా 478 రన్స్ ఆధిక్యంలో కొనసాగుతున్నది.
28 రన్స్కే.. 6 వికెట్లు
ఇండియా తొలి ఇన్నింగ్స్ తొందరగానే ముగియడంతో బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ను దీప్తి బెంబేలెత్తించింది. డీవై పాటిల్ స్టేడియం పిచ్ స్పిన్కు అనుకూలంగా మారడంతో.. అద్బుతమైన యాంగిల్స్లో బాల్ను టర్న్ చేస్తూ ఇంగ్లిష్ లైనప్ పేకమేడలా కూల్చింది. మూడో ఓవర్లో సోఫీ డంక్లీ (11)ని ఔట్ చేసి రేణుకా సింగ్ (1/32) ఇచ్చిన శుభారంభాన్ని దీప్తితో పాటు మిగతా బౌలర్లు బాగా సద్వినియోగం చేసుకున్నారు. 8వ ఓవర్లో కెప్టెన్ హీథర్ నైట్ (11)ని పూజా వస్త్రాకర్ (1/39) దెబ్బకొట్టింది. 28 రన్స్కే 2 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ను ఆదుకునే బాధ్యతను బ్యూమోంట్(10), సివర్ బ్రంట్ తీసుకున్నారు. ఇక్కడి నుంచి బ్రంట్ సింగిల్స్తో పాటు ఫోర్లూ బాదడంతో స్కోరు బోర్డు క్రమంగా మెరుగుపడింది. అయితే 19వ ఓవర్లో బ్యూమోంట్అనూహ్యంగా రనౌట్ కావడంతో ఇంగ్లండ్ కష్టాలు మొదలయ్యాయి. క్రీజులోకి వచ్చిన డ్యానీ వ్యాట్ (19) కుదురుకునేందుకు ట్రై చేసినా దీప్తి టర్నింగ్ బాల్స్ ముందు నిలువలేకపోయింది. క్లాసిక్ ఆఫ్ స్పిన్ బాల్ను బ్యాట్–ప్యాడ్తో ఆడే క్రమంలో వ్యాట్ షార్ట్ లెగ్లో రొడ్రిగ్స్కు క్యాచ్ ఇవ్వడంతో స్కోరు 26 ఓవర్లలో 108/4గా మారింది. 30వ ఓవర్లో దీప్తి డబుల్ ఝలక్ ఇచ్చింది. మూడు బాల్స్ తేడాలో అమీ జోన్స్ (12), ఎకిల్స్టోన్ (0)ను పెవిలియన్కు పంపింది. ఆ వెంటనే స్నేహ్ రాణా (2/25) తన వరుస ఓవర్ల (31, 33)లో బ్రంట్, చార్లీ డీన్ (0)ను ఔట్ చేసి ఇంగ్లండ్కు కోలుకోలేని షాకిచ్చింది. ఇది చాలదన్నట్లుగా దీప్తి మళ్లీ డబుల్ స్ట్రోక్ ఇచ్చింది. 34, 36వ ఓవర్లలో వరుసగా కేట్ క్రాస్ (1), లారెన్ ఫిలెర్ (5)ను పెవిలియన్కు చేర్చింది. దీంతో 108/4తో ఉన్న ఇంగ్లండ్ 28 రన్స్ తేడాతో చివరి 6 వికెట్లు కోల్పోయి తక్కువ స్కోరుకే పరిమితమైంది.
హర్మన్ నిలకడ..
తర్వాత రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇండియాను ఇంగ్లిష్ బౌలర్లు చార్లీ డీన్ (4/68), ఎకిల్స్టోన్ (2/76) దెబ్బకొట్టినా, హర్మన్ నిలకడగా ఆడి భారీ లీడ్కు బాటలు వేసింది. ఓపెనింగ్లో షెఫాలీ, స్మృతి మంధాన (26) తొలి వికెట్కు 61 రన్స్ జోడించారు. అయితే 16 రన్స్ తేడాలో ఈ ఇద్దరితో పాటు యాస్తికా భాటియా (9) కూడా ఔట్ కావడంతో ఇండియా 77/3 స్కోరుతో నిలిచింది. ఈ దశలో జెమీమా (27), హర్మన్ నిలకడగా ఆడి ఇన్నింగ్స్ను నిలబెట్టారు. నాలుగో వికెట్కు 32 రన్స్ జత చేసి జెమీమా ఔటైనా, దీప్తి శర్మ (20) ఫర్వాలేదనిపించింది. ఐదో వికెట్కు 24 రన్స్ జోడించి వెనుదిరిగింది. స్నేహ్ రాణా (0) నిరాశపర్చినా, పూజా వస్త్రాకర్.. హర్మన్కు మంచి సహకారం అందించింది. వికెట్ పడకుండా రోజును ముగించింది.