- దేశాల మధ్య పరిస్థితులు దిగజారుతున్నయ్
- డామినేటింగ్ ట్రెండ్ మంచిది కాదు: రాజ్ నాథ్
న్యూఢిల్లీ: ఇరాన్ – ఇజ్రాయెల్, అమెరికా మధ్య యుద్ధం రోజురోజుకు తీవ్రం అవుతుండడంపై రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈరోజుల్లో యుద్ధాలు చాలా సాధారణంగా మారిపోయాయని వ్యాఖ్యానించారు. శుక్రవారం కోల్కతాలో నిర్వహించిన మారీ టైమ్ కాంక్లేవ్ ‘సాగర్ సంకల్ప్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. యుద్ధం లాంటి అసాధారణ పరిస్థితులు సాధారణంగా మారిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
‘‘ప్రస్తుతం దేశాల మధ్య పరిస్థితులు రోజురోజుకు దిగజారిపోతున్నాయి. ఒకరిపై ఒకరు ఆధిపత్యం చూపాలనుకుంటున్నారు. ఇలాంటి ధోరణి మంచిది కాదు. ఇలాంటి డామినేటింగ్ ట్రెండ్ వల్ల భవిష్యత్లో పరిస్థితులు మరింత కష్టంగా మారుతాయి. నేల, గాలి, సముద్రం, చివరికి స్పేస్ లోనూ వివిధ దేశాలు పోటీపడుతున్న తీరు ఆందోళన కలిగిస్తున్నది” అని రాజ్ నాథ్ పేర్కొన్నారు. హార్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంపై స్పందించారు. జలసంధి మూసివేత భవిష్యత్తులో ఎలాంటి పరిణామానికి దారితీస్తుందోనని ఆందోళన వ్యక్తం చేశారు.
