ఢిల్లీ స్కూళ్లలో ఎయిర్ ప్యూరిఫైయర్‌‌లు

ఢిల్లీ స్కూళ్లలో ఎయిర్ ప్యూరిఫైయర్‌‌లు
  • 10 వేల క్లాస్​రూమ్​లలో ఏర్పాటుకు మంత్రి ఆదేశం

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత రోజురోజుకు పడిపోతున్న నేపథ్యంలో విద్యార్థులకు స్వచ్ఛమైన గాలిని అందించడానికి 10 వేల తరగతి గదులలో ఎయిర్ ప్యూరిఫైయర్‌‌లను ఏర్పాటు చేయనున్నట్టు ఢిల్లీ విద్యాశాఖ మంత్రి ఆశిష్ సూద్ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీలో వాయు కాలుష్య సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఢిల్లీలో మొత్తం 38 వేల తరగతి గదులు ఉన్నాయి. 

వాటిలో దశలవారీగా ఎయిర్ ప్యూరిఫైయర్‌‌లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి దశలో 10 వేల తరగతి గదులలో ఎయిర్ ప్యూరిఫైయర్‌‌లను ఏర్పాటు చేసేందుకు శుక్రవారం టెండర్లు పిలిచినట్టు మంత్రి ఆశిష్ సూద్ తెలిపారు. 

అలాగే, పర్యావరణ సెస్ నిధులను ఉపయోగించి పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌‌మెంట్ ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి మెకానికల్ రోడ్ స్వీపర్‌‌ ను కూడా కొనుగోలు చేస్తుందని చెప్పారు. కాలుష్యాన్ని నిర్మూలించేందుకు తాము అన్ని చర్యలు తీసుకుంటున్నామని, వాటి ఫలితాలు త్వరలోనే క్షేత్రస్థాయిలో కనిపిస్తాయని మంత్రి ఆశిష్ సూద్ స్పష్టం చేశారు.