న్యూఢిల్లీ : సభా కార్యకలాపాలను అదేపనిగా అడ్డుకున్నందుకు విపక్షాలకు చెందిన19 మంది రాజ్యసభ సభ్యులపై సస్పెన్షన్ విధించారు. వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన ఈ నెల 18 నుంచి విపక్షాల ఎంపీలు.. ధరల పెరుగుదల, నిత్యావసరాలపై జీఎస్టీ విధింపునకు నిరసనగా హౌస్ ప్రొసీడింగ్స్కు ఆటంకం కలిగిస్తూనే ఉన్నారు. మంగళవారం కూడా సభ ప్రారంభమైన కాసేపటికే వెల్లోకి దూసుకెళ్లారు. వెనక్కి వెళ్లి ఎవరి సీట్లలో వారు కూర్చోవాలని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్హరివన్ష్ ఎంతగా విజ్ఞప్తి చేసినా వారు వినలేదు. దీంతో సభ రెండుసార్లు 15 నిమిషాలపాటు వాయిదా పడింది. ఆ తర్వాత కూడా ఎంపీలు అదేపనిగా హౌస్కు ఆటంకం కలిగించడంతో ఆరోజు మొత్తానికి సభను డిప్యూటీ చైర్మన్ వాయిదా వేశారు. అప్పటికీ విపక్ష ఎంపీలు.. కనీస అవసరాలపై జీఎస్టీ విధింపుపై చర్చకు పట్టుబడుతూనే ఉన్నారు. వెల్లో నినాదాలు చేస్తూ సభా కార్యకలాపాలకు అడ్డుపడ్డారు. దీంతో వారిపై సస్పెన్షన్ తీర్మానం ప్రవేశపెట్టాలని ట్రెజరీ బెంచ్ను ఆయన ఆదేశించారు. తర్వాత పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అనుచిత ప్రవర్తన, సభాధిపతి పట్ల ఏమాత్రం గౌరవం చూపనందుకు పది మంది ఎంపీలు ఈ వారమంతా హౌస్కు హాజరు కాకుండా వారిపై సస్పెన్షన్ విధిస్తున్నామని డిప్యూటీ చైర్మన్ తెలిపారు. వాయిస్ ఓటు ద్వారా సభ ఈ తీర్మానాన్ని ఆమోదించింది.
సస్పెండ్ అయిన ఎంపీలు వీళ్లే..
సస్పెండ్ అయిన 19 మంది రాజ్యసభ సభ్యుల్లో ఏడుగురు టీఎంసీ, ఆరుగురు డీఎంకే, ముగ్గురు టీఆర్ఎస్, ఇద్దరు సీపీఎం, ఒకరు సీపీఐ సభ్యుడు ఉన్నారు. టీఎంసీకి చెందిన సుస్మితా దేవ్, మౌసమ్నూర్, శాంతా ఛేత్రి, దోలా సేన్, శాంతనూ సేన్, అబిర్ రంజన్ బిశ్వాస్, నదీముల్ హక్, డీఎంకేకు చెందిన మొహమ్మద్ అబ్దుల్లా, కనిమొళి ఎన్వీఎన్సోము, షణ్ముగం, కల్యాణసుందరం, గిరిరాజన్, ఎన్ఆర్ ఎలాంగో, టీఆర్ఎస్కు చెందిన బి.లింగయ్య యాదవ్, రవిచంద్ర వద్దిరాజు, దామోదర్రావు దీవకొండలపై సస్పెన్షన్ విధించారు. అలాగే సీపీఎం నుంచి సదాశివన్, ఏఏ రహీం, సీపీఐ నుంచి సంతోష్కుమార్లను సస్పెండ్ చేశారు. మంగళవారం ఏ ఒక్క అంశంపై చర్చ జరగకుండానే సభ తుడిచిపెట్టుకుపోయింది. కాగా అంతకుముందు వివిధ విపక్షాల నేతలు కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పార్లమెంట్ఆవరణలో ధర్నా చేశారు.
దేశంలో డెమోక్రసీని సస్పెండ్ చేశారు: టీఎంసీ
రాజ్యసభ నుంచి 19 మంది సభ్యులను సస్పెండ్చేయడంపై కేంద్రంపై టీఎంసీ తీవ్రంగా విరుచుకుపడింది. ‘‘దేశంలో డెమోక్రసీని సస్పెండ్ చేశారు. పార్లమెంట్ను డార్క్ చాంబర్గా మార్చారు. పార్లమెంట్ అంటే మోడీ భయపడుతున్నారు” అని టీఎంసీ లీడర్ డెరెక్ ఒబ్రెయిన్ మీడియాతో అన్నారు.
లోక్సభలోనూ అదే సీన్
ధరల పెరుగుదల, జీఎస్టీ, కేంద్ర సంస్థల దుర్వినియోగంపై సభను వాయిదావేయాలని లోక్సభలో విపక్షాలు పట్టుబట్టాయి. మంగళవారం ‘కార్గిల్ విజయ్ దివస్’ సందర్భంగా సైనికులకు స్పీకర్ ఓం బిర్లా నివాళులర్పించి సభను ప్రారంభించారు. సభ ప్రారంభంకాగానే ద్రవ్యోల్బణం, జీఎస్టీకి వ్యతిరేకంగా విపక్ష లీడర్లు ప్లకార్డులు పట్టుకొని వెల్లోకి దూసుకెళ్లారు. జీరో అవర్లో మాట్లాడేందుకు అనుమతిస్తానని స్పీకర్ చెప్పినా వినలేదు. దీంతో సభను స్పీకర్ 11.45 గంటల దాకా వాయిదా వేశారు. మళ్లీ సమావేశమైన తర్వాత కూడా ప్రతిష్టంభన కొనసాగింది. ఈ క్రమంలో కాంగ్రెస్ సభ్యులు వాకౌట్ చేశారు. కేంద్ర సంస్థల దుర్వినియోగానికి వ్యతిరేకంగా రాష్ట్రపతి భవన్వైపు ప్రదర్శనగా వెళ్లి ధర్నా చేశారు.
బరువైన హృదయంతో సస్పెన్షన్ నిర్ణయం: బీజేపీ
రాజ్యసభ నుంచి 19 మంది విపక్ష ఎంపీలను సస్పెండ్ చేయాలన్న నిర్ణయాన్ని ఎంతో భారంగా తీసుకున్నామని బీజేపీ తెలిపింది. సభకు ఆటంకం కలిగించవద్దని డిప్యూటీ స్పీకర్వారికి ఎంత విజ్ఞప్తి చేసినా వినలేదని, దీంతో వారిపై తప్పక సస్పెన్షన్ విధించాల్సి వచ్చిందని రాజ్యసభలో బీజేపీ లీడర్ పీయూష్ గోయల్ తెలిపారు.