హైదరాబాద్ : కరోనా క్రమంలో బోనాల వేడుకలను నిరాడంబరంగా జరపాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. దీంతో ప్రతిసారీ అంగరంగ వైభవంగా జరిగే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల పండుగ ఈ సారి నిరాడంబరంగా జరగనుంది. కరోనా వైరస్ విజృంభణ దృష్ట్యా ఈ ఏడాది మహంకాళి ఆలయంలోకి భక్తులకు అనుమతి లేదని తెలిపారు ఆలయ అధికారులు. ఆలయ పూజారులు, సిబ్బంది మాత్రమే అమ్మవారికి బోనం సమర్పించి, పూజలు నిర్వహిస్తారన్నారు. జులై 10 నుంచి 13వ తేదీ వరకు భక్తులను అనుమతించమని చెప్పారు ఆలయ నిర్వాహకులు. ఈ సారి ఇండ్లలోనే బోనం సమర్పించుకోవాలని భక్తులకు సూచించారు.
ప్రతి ఏడాది ఆనవాయితీగా జరిగే పూజలు సంప్రదాయబద్దంగా నిర్వహిస్తామని, బోనాల వేడుకలను ప్రభుత్వం రద్దు చేసిందని తెలిపారు. వచ్చే శుక్రవారం, ఆదివారం, సోమవారాల్లో భక్తులకు ప్రవేశం లేదన్నారు. ఆదివారం నాటి పూజలు, సోమవారం జరిగే రంగం యధావిధిగా కొనసాగుతుందని చెప్పారు ఆలయ నిర్వాహకులు.