
యాదగిరిగుట్ట/తాడ్వాయి, వెలుగు : వీకెండ్ కావడంతో రాష్ట్రంలోని పలు ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఆదివారం యాదగిరిగుట్టతో పాటు మేడారంలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. యాదగిరిగుట్టలో దర్శన, ప్రసాద క్యూలైన్లు, ప్రధానాలయ ప్రాంగణం భక్తులతో నిండిపోయింది. రద్దీ కారణంగా స్వామి వారి దర్శనానికి మూడు గంటలు, ప్రత్యేక దర్శనానికి గంట టైం పట్టిందని భక్తులు తెలిపారు. ఆలయంలో నిర్వహించిన నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, సుదర్శన నారసింహ హోమంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.
ఆదివారం భక్తులు జరిపించిన పూజలు, నిత్య కైంకర్యాల ద్వారా ఆలయానికి రూ.65,60,477 ఆదాయం వచ్చింది. ఇందులో ప్రసాద విక్రయం ద్వారా రూ.22,04,620, కొండపైకి వాహనాల ప్రవేశంతో రూ.7.59 లక్షలు, వీఐపీ దర్శనాల ద్వారా రూ.14.55 లక్షలు, బ్రేక్ దర్శనాలతో రూ.6,72,600 వచ్చాయి. అలాగే సత్యనారాయణస్వామి వ్రతాల ద్వారా రూ.2,51,200, యాదరుషి నిలయం ద్వారా రూ.3,30,606, కల్యాణకట్ట ద్వారా రూ.1.51 లక్షల ఆదాయం సమకూరినట్లు ఆఫీసర్లు వెల్లడించారు.
వనదేవతలకు మొక్కులు చెల్లించుకున్న భక్తులు
ములుగు జిల్లా మేడారం సమ్మక్క, సారలమ్మను దర్శించుకునేందుకు ఆదివారం భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. కుటుంబ సమేతంగా మేడారం చేరుకున్న భక్తులు ముందుగా జంపన్నవాగులోని పుణ్యస్నానాలు ఆచరించి, తలనీలాలు సమర్పించారు. ఎత్తు బంగారం, ఒడి బియ్యం, కొబ్బరికాయలతో అమ్మవార్ల గద్దెల ప్రాంగణాన్ని చేరుకుని పూలు, పండ్లు, పసుపు, కుంకుమ, నూతన వస్త్రాలు సమర్పించారు. అనంతరం యాటలు, కోళ్లను వనదేవతలకు ఎదురిచ్చి మొక్కులు సమర్పించుకున్నారు. తర్వాత అటవీ ప్రాంతాల్లో విందు భోజనాలు చేశారు. భక్తుల సంఖ్య పెరగడంతో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు.