మా నాన్నసూసైడ్‌‌పై అనుమానాలున్నాయ్

మా నాన్నసూసైడ్‌‌పై అనుమానాలున్నాయ్
  •     న్యాయం చేయాలంటున్న ధర్మారెడ్డి కూతురు 
  •     కండీషనల్​ బెయిల్‌‌పై వచ్చిన ధర్మారెడ్డి కొడుకు శ్రీకాంత్​రెడ్డి

హైదరాబాద్‌‌(కుషాయిగూడ), వెలుగు: కీసర ఎమ్మార్వో నాగరాజు కోటి పది లక్షల లంచం కేసులో నిందితుడు కందాడి ధర్మారెడ్డి సూసైడ్‌‌ సంచలనం సృష్టిస్తోంది. 4 రోజుల క్రితం బెయిలుపై విడుదలైన ధర్మారెడ్డి ఆదివారం ఉదయం వాసవి శివానగర్​, కన్యకా పరమేశ్వరి ఆలయం వద్ద చెట్టుకు ఉరివేసుకున్నాడు. ఇదే కేసులో చంచల్​గూడ జైలులో రిమాండ్​ ఖైదీగా ఉన్న ధర్మారెడ్డి కొడుకు శ్రీకాంత్‌‌రెడ్డి సోమవారం కండీషనల్ బెయిల్‌‌పై వచ్చి అంత్యక్రియలు చేశారు. ధర్మారెడ్డి ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, ఎవరైనా భయభ్రాంతులకు గురి చేశారా ? లేక హత్య చేసి ఆత్మహత్యగా చూపిస్తున్నారా అని ఆయన బంధువులు అనుమానం వ్యక్తం చేశారు. ధర్మారెడ్డి కూతురు ఉమ మాట్లాడుతూ.. మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే కిచ్చనగారి లక్ష్మారెడ్డి  తమ వారసత్వ భూమిపై కన్ను వేశాడని, 97 ఎకరాల భూమిలో  కేఎల్‌‌ఆర్​ పేరుతో పలు కంపెనీలు ఏర్పాటు చేశారని, కుట్ర పూరితంగానే తమను ఈ కేసులో ఇరికించారన్నారు. ఈ భూ వివాదంలో రాజకీయ నేతల ప్రమేయం ఉందని చెప్పారు. పూర్తి విచారణ జరిపించి తమకు న్యాయం చేయాలన్నారు