హైదరాబాద్, వెలుగు: హ్యూమన్ ట్రాఫికింగ్, మిస్సింగ్ కేసులపై పోలీస్ డిపార్ట్మెంట్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. మహిళలు,చిన్నారులను అక్రమ రవాణా చేసే ముఠాల వివరాలు సేకరిస్తోంది. ఆన్లైన్లో వేధింపులు,పోర్నోగ్రఫీ వెబ్సైట్లపై నిఘా పెట్టనుంది. ఇందుకోసం లక్డీకాపూల్లో స్పెషల్ మిస్సింగ్ సెల్ ఏర్పాటు చేస్తోంది. విమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సైబర్ ల్యాబ్, మిస్సింగ్ సెల్ను వచ్చే నెలలో అందుబాటులోకి రానుంది. ఇప్పటికే పూర్తి స్థాయి సిబ్బంది, టెక్నికల్ టూల్స్తో హై టెక్నాలజీ ల్యాబ్ను రూపొందించారు.
హ్యూమన్ ట్రాఫికింగ్ నుంచి రెస్క్యూ చేసేందుకు
మిస్సింగ్ కేసులపై డిజిటల్ ట్రేసింగ్లో భాగంగా పోలీసులు ఆన్లైన్లో మహిళలు,చిన్నారులను వేధిస్తున్న వారి డేటాను కలెక్ట్ చేయనున్నారు.
స్థానిక పోలీస్ స్టేషన్లలో రిజిస్టర్ అయ్యే కేసులను షీ టీమ్స్ సైబర్ ల్యాబ్కి కనెక్ట్ చేస్తుంది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసులను సైబర్ క్రైమ్,యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్లతో మానిటరింగ్ చేస్తారు. కేసుల తీవ్రతను బట్టి అవసరమైన చర్యలు తీసుకుంటారు. గ్రౌండ్ లెవెల్లో సిబ్బందికి ఇప్పటికే ట్రైనింగ్ పూర్తి చేశారు. ఆన్లైన్ వేధింపులు, ఫోన్, వాట్సాప్, సోషల్మీడియాలో వేధింపులకు సంబంధించిన కేసులను సైబర్ ఇంటెలిజెన్స్ టీమ్ ట్రేస్ చేసేలా ప్లాన్ చేశారు. కేస్ స్టడీస్ ఆధారంగా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ రూపొందిస్తారు. దీంతో మహిళలు,చిన్నారుల సెక్యూరిటీకి అవసరమైన చర్యలు తీసుకునేలా ప్లాన్ చేశారు.
ఎన్సీబీ రిపోర్టు ఆధారంగా..
మహిళలు, చిన్నారుల ట్రాఫికింగ్ కేసులను మిస్సింగ్ సెల్కి పోలీసులు కనెక్ట్ చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన మిస్సింగ్ కేసులు, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. పెండింగ్ కేసులపై స్పెషల్ మానిటరింగ్ చేస్తున్నారు. మిస్సింగ్ కేసుల్లో మహిళలు,యువతులు, చిన్నారుల వయస్సును పరిగణలోకి తీసుకుని హ్యూమన్ ట్రాఫికింగ్ ట్రాకింగ్ను బ్రేక్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్స్ని సైబర్ ల్యాబ్తో కనెక్ట్ చేశారు. ఇలా గతేడాది కాలంగా మిస్సింగ్ కేసుల్లో మంచి రిజల్ట్ సాధించారు. దర్పణ్ టూల్ ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేటర్, సైబర్ క్రైం ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్,సీఐడీతో కలిసి మిస్సింగ్ కేసులను ట్రేస్ చేస్తున్నారు.