
భారత దేశంలో పర్యటించేందుకు వచ్చిన అమెరిక్లను ఆ దేశం అలర్ట్ చేసింది. అమెరికా పౌరులెవరూ జమ్ము కశ్మీర్లో పర్యటించవద్దని అమెరికా ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా బాలాకోట్ ఉగ్రస్థావరంపై భారత్ వైమానికి దాడులు చేయడంతో భారత్-పాక్ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని అందుకే అమెరికన్లను హెచ్చరిస్తున్నామన్నారు. తూర్పు లడఖ్ ప్రాంతం, లేహ్ మినహా కశ్మీర్లోని ఏ ప్రదేశానికి వెళ్లొద్దని అమెరికా ట్రావెల్ అడ్వైజరీ సూచించింది. ఉగ్రవాదుల ఏరివేతలో భాగంగా భారత్ భద్రతా దళాలు కాల్పులు కొనసాగిస్తున్నందున సరిహద్దుకు 10 కిలోమీటర్ల దూరంలోనే ఉండిపోవాలని ఆదేశించింది. ఉగ్రవాదులు ఎలాంటి హెచ్చరికలు చేయకుండా పర్యాటక ప్రాంతాలు, రవాణా ప్రాంగణాలు, మార్కెట్లు, షాపింగ్ మాల్స్, ప్రభుత్వ కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తారని ట్రావెల్ అడ్వైజరీ తెలిపింది.