
- ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్
బషీర్బాగ్, వెలుగు: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో చేప ప్రసాదం పంపిణీకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. ఎగ్జిబిషన్ సొసైటీ ప్రతినిధులతో కలిసి బుధవారం ఆయన ఏర్పాట్లను పరిశీలించారు. చేప ప్రసాదం కోసం 1.5 లక్షల చేప పిల్లలను ఫిషరీస్ కార్పొరేషన్ ద్వారా సిద్ధం చేసినట్లు తెలిపారు.
క్యూలైన్లలో ఇబ్బందులు రాకుండా భద్రతా ఏర్పాట్లు చేయాలని పోలీసులకు సూచించారు. తాగునీరు, భోజన వసతి కల్పించే స్వచ్ఛంద సంస్థలకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. జూన్ 6 నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మంత్రి వెంట ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయికుమార్, నిర్వాహకులు బత్తిని సోదరులు ఉన్నారు.