ఏపీలో కరోనా విస్తరిస్తుండటంతో వైద్యశాఖ అధికారులు అలర్ట్ ప్రకటించారు. విశాఖలోని అల్లిపురం ప్రాంతానికి చెందిన వృద్ధుడికి కరోనా పాజిటివ్ రావడంతో అతడు నివాసమున్న ప్రాంతాల్లో డాక్టర్లు ఆరాతీస్తున్నారు. ఇటీవల మక్కా వెళ్లి వచ్చిన ఈ వృద్ధుడు ఈ వారం రోజులపాటు ఎవరెవరిని కలిశారు, ఎక్కడికి వెళ్లాడు తదితర అంశాలపై ఆరాతీస్తున్నారు. అదే సమయంలో వృద్దుడి నివాస ప్రాంతాల్లో ముందుజాగ్రత్త చర్యలు కూడా చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి తిరుపతిరావు మాట్లాడుతూ ఆశావర్కర్లు, వాలంటీర్లతో కలిపి 114 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. మొత్తం 7,800 ఇళ్లపై ఆరాతీస్తున్నామన్నారు. స్పేయింగ్ చేయడంతో పాటు వ్యాధి లక్షణాలున్న వారిని గుర్తిస్తామని తెలిపారు.