న్యూఢిల్లీ: ఏజీఆర్ బకాయిలను వాయిదాలలో కడతామని టెలికాం కంపెనీలు చేస్తున్న ప్రపోజల్ను పరిశీలించాలని డాట్ను సుప్రీం కోర్టు ఆదేశించింది. టెలికాం కంపెనీలు తమ ఫైనాన్షియల్ స్టేట్మెంట్లను, బ్యాలెన్స్ షీట్లను సబ్మిట్ చేయాలని అడిగింది. ఈ కేసుపై తదుపరి హియరింగ్ను జులై మూడో వారానికి వాయిదా వేసింది. జస్టిస్ అరుణ్ మిశ్రా, ఎస్ అబ్దుల్ నాజిర్, ఎంఆర్ షాలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును ఇచ్చింది. టెలికాం కంపెనీలు కొంత మొత్తాన్ని ముందే (డిపాజిట్గా) పే చేయాలని పేర్కొంది. టెల్కోలు ఆఫర్ చేసిన పద్ధతిలో లెక్కలు తేల్చడానికి కేంద్రానికి కొంత టైమ్ కావాలని సొలిసిటరీ జనరల్(ఎస్జీ) తుషార్ మెహతా కోర్టును కోరారు. దీంతో పాటు టెల్కోలు ఇచ్చిన జవాబులను కూడా సుప్రీం కోర్టు పరిగణనలోకి తీసుకొని, ఈ కేసులో తదుపరి హియరింగ్ను జులై మూడో వారానికి వాయిదా వేసింది. చెల్లింపుల కోసం వొడాఫోన్ ఐడియా ఆఫర్తో ముందుకు రావాలంది. వొడాఫోన్ ఐడియా తమను తాము ఫారిన్ కంపెనీగా చెప్పుకుంటుండడంతో కోర్టు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఒక వేళ ఇండియాలో ఆస్తులను వదిలేసి పారిపోతే పరిస్థితేంటని అడిగింది. కేవలం ఇన్స్టాల్మెంట్ పద్ధతిలోనే 20 ఏళ్లలో ఏజీఆర్ బకాయిలను చెల్లించగలమని వొడాఫోన్ ఐడియా లాయర్ కోర్టుకు చెప్పారు. డబ్బులు సంపాదించాకే బకాయిలు కట్టగలమని పేర్కొన్నారు. గత కొన్ని క్వార్టర్ల నుంచి కంపెనీకి లాభాలు రావడం లేదని, కంపెనీకి ఉన్న చాలా వరకు ఆస్తులను బ్యాంకుల వద్ద తనఖా పెట్టి లోన్లు తీసుకున్నామని పేర్కొనారు.
డిపాజిట్ కట్టలేం..గ్యారెంటీలను వాడుకోండి
అదనంగా డిపాజిట్ చేయలే మని బ్యాంకు గ్యారెంటీలను సెక్యూరిటీలుగా వాడుకోవాలని టెల్కోలు కోర్టును కోరాయి. సుమారు రూ. 15,000 కోట్ల విలువైన కంపెనీ బ్యాంక్ గ్యారెంటీలను సెక్యూరిటీగా వాడుకోవాలని వొడాఫోన్ ఐడియా పేర్కొంది.