ముంబై: లోక్ సభ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేందుకు హోటళ్లు, షాపింగ్ మాల్స్ పలు రాయితీలు ప్రకటించడం ఇప్పటికే చూశాం.. తాజాగా ముంబై మెట్రో కూడా డిస్కౌంట్ ప్రకటించింది. పోలింగ్ బూత్ దాకా వెళ్లి ఓటేసి వచ్చేలా ప్రోత్సహించేందుకు ప్రయాణీకులకు టికెట్ ధరపై రాయితీ ఇవ్వనున్నట్లు తెలిపింది. పోలింగ్ రోజు నిర్ణీత రూట్ లో ప్రయాణించే వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది.
ఈ నెల 20న ముంబైలోని ఐదు లోక్ సభ నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలోనే ముంబై మెట్రో ఆ రోజు ప్రయాణించే వారికి టికెట్ ధరపై 10% రాయితీ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ప్రయాణికులలో అవగాహన పెంచి, వారు తమ ఓటు హక్కు వినియోగించుకునేలా చూడడమే ఈ ఆఫర్ ఉద్దేశమని తెలిపింది.
ఈ నెల 20న మెట్రో లైన్ 2ఏ ((అంధేరీ (వెస్ట్) – దహిసర్ (ఈస్ట్) రూట్), లైన్ 7 ((దహిసర్ (ఈస్ట్) – అంధేరి (ఈస్ట్) రూట్) మార్గాల్లో ప్రయాణించే వారికి ఈ రాయితీ వర్తిస్తుందని ముంబై మెట్రో ఆపరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎంఎంఎంఓసీఎల్) ఓ ప్రకటనలో తెలిపింది. సిస్టమాటిక్ ఓటర్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్ కార్యక్రమంలో భాగంగా మెట్రో ప్రయాణీకులను ఎన్నికల ప్రక్రియలో పాలుపంచుకునేలా చూడడానికి ఈ రాయితీ ఇస్తున్నట్లు వివరించింది. ఈ ఆఫర్తో పోలింగ్ శాతం పెరుగుతుందని ముంబై మెట్రో ఆశాభావం వ్యక్తం చేసింది.