క్రిష్ణానగర్ (బెంగాల్): ఓటమి భయంతో కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్గాంధీ అమేథీ నుంచి రాయ్బరేలీకి పారిపోయారని ప్రధాని మోదీ విమర్శించారు. ‘భయపడకండి.. పారిపోకండి..’ అంటూ చురకలంటించారు. రాహుల్గాంధీ కొత్త సీటు వెతుక్కుంటారని తాను ముందే చెప్పానని అన్నారు. బెంగాల్లోని బర్ధమాన్ దుర్గాపూర్, క్రిష్ణానగర్లో శుక్రవారం నిర్వహించిన బీజేపీ ఎన్నికల ర్యాలీలో మోదీ పాల్గొని ప్రసంగించారు. ఈ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆధిక్యం ఆల్టైమ్ కనిష్టానికి చేరుకుంటుందని చెప్పారు. కనీసం50 సీట్లన్నా గెల్చుకోవాలని ఆ పార్టీ కష్టపడుతోందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్కు అధికారమిస్తే బుజ్జగింపు రాజకీయాల కోసం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను లాక్కొని ‘జిహాదీ ఓటు బ్యాంకు’ (ముస్లింల)కు ఇస్తుందని మోదీ ఆరోపించారు.
కాంగ్రెస్ ఓటమి ఖాయమైపోయింది
కాంగ్రెస్ ఓటమి ఖాయమైపోయిందని చెప్పడానికి ఒపీనియన్ పోల్స్, ఎగ్జిట్పోల్స్ అక్కర్లేదని మోదీ అన్నారు. ‘కాంగ్రెస్ ఓటమి గురించి ఇటీవల పార్లమెంట్లో మాట్లాడా. ఆ పార్టీ సీనియర్ లీడర్ లోక్సభ సీట్ను వదులుకొని రాజస్థాన్నుంచి రాజ్యసభకు ఎంటర్ అయినప్పుడే వారి ఓటమి ఖాయమైపోయింది’ అని సోనియాగాంధీని ఉటంకిస్తూ మోదీ వ్యాఖ్యానించారు. ఇప్పుడు రాహుల్గాంధీ ఓటమి భయంతో రాయ్బరేలినుంచి పోటీకి దిగుతున్నారని ఎద్దేవా చేశారు. 15 సీట్లు గెలిచి తృణమూల్ కాంగ్రెస్, 50 లోపు సీట్లు గెలిచి కాంగ్రెస్.. లెఫ్ట్ పార్టీలతో కలిసి సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలవా? అని ప్రశ్నించారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ మాత్రమే సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదని చెప్పారు.
లిఖితపూర్వకంగా చెప్పగలరా..?
అధికారంలోకి వస్తే మతపరంగా రిజర్వేషన్లు కల్పించేందుకు రాజ్యాంగాన్ని సవరించబోమని లిఖితపూర్వకంగా చెప్పగలరా? అని కాంగ్రెస్కు మోదీ సవాల్ విసిరారు. ‘దేశంలో మతపరంగా రిజర్వేషన్లు ఉండొద్దని రాజ్యాంగం చెబుతోంది. కానీ..బీజేపీకి మద్దతు ఇచ్చినందుకు దళితులు, ఓబీసీలపై కాంగ్రెస్ కోపంగా ఉన్నది. వారి రిజర్వేషన్లు లాక్కొని ముస్లింలకు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నది’ అని ఆరోపించారు.
బెంగాల్లో సెకండ్ క్లాస్ సిటిజన్లుగా హిందువులు
రాష్ట్రంలో టీఎంసీ అవినీతి, బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతోందని మోదీ విమర్శించారు. బెంగాల్లో హిందువులను ద్వితీయ శ్రేణి పౌరులుగా మార్చేసిందని మండిపడ్డారు. హిందువులను భగీరథ నదిలో పడేస్తామని ముర్షీదాబాద్ జిల్లాలో టీఎంసీ ఎమ్మెల్యే హుమాయూన్ కబీర్ చేసిన వ్యాఖ్యలపై మోదీ స్పందించారు. ‘ఇవేం రాజకీయాలు? టీఎంసీకి మానవత్వం కంటే బుజ్జగింపు రాజకీయాలే ఎక్కువా? రామ మందిరం.. శ్రీరామ నవమి శోభాయాత్ర..జై శ్రీరామ్ నినాదాలతో వారికి సమస్యలున్నాయి’ అని మండిపడ్డారు. స్కూల్సర్వీస్ కమిషన్ స్కామ్ వల్ల ఉద్యోగాలు కోల్పోయిన నిజమైన టీచర్ అభ్యర్థులకు న్యాయం చేసేందుకు బీజేపీ ఆధ్వర్యంలో ప్రత్యేక లీగల్ సెల్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. వివిధ స్కామ్లలో బెంగాల్ ప్రజలను దోచుకున్నవారిని వదిలిపెట్టబోమని, ఇది మోదీ గ్యారెంటీ అని చెప్పారు.