- ఎన్సీబీ, డీఆర్ఐతో కలిసి జాయింట్ ఆపరేషన్లు
- ఏపీ, ఒడిశా బార్డర్లో నిఘా
- ఏడాది కాలంలో 7 టన్నుల గంజాయి పట్టివేత
- డిమాండ్ తగ్గించి, సప్లయ్ తగ్గించాలి: ఈగల్ ఫోర్స్ డైరెక్టర్ సందీప్ శాండిల్యా
హైదరాబాద్, వెలుగు: గంజాయికి అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ఈగల్ ఫోర్స్ పక్కా ప్రణాళికలతో ముందుకెళ్తోంది. హైదరాబాద్ సహా దేశంలో సప్లయ్ జరుగుతున్న గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపుతోంది. ఏపీ, ఒడిశా పోలీసులతో పాటు నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ), డైరెక్టరేట్ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ)తో కలిసి రాష్ట్ర సరిహద్దుల్లో ఆపరేషన్ గంజాయి నిర్వహిస్తోంది. ఏపీ, ఒడిశా ఏజెన్సీల నుంచి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్ర, కర్నాటక తదితర రాష్ట్రలకు తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాలపై నిఘా పెట్టింది. ఈ క్రమంలోనే ఏడాది కాలంగా దాదాపు 7 టన్నుల గంజాయిని స్వాధీనం చేసుకుంది.
గంజాయి ట్రాన్స్పోర్ట్ రూట్లు టార్గెట్
గంజాయి సరఫరాను తగ్గించండంతో పాటు డిమాండ్ను తగ్గించడం వంటి అంశాలపై ఈగల్ఫోర్స్ దృష్టి సారించింది. సిండికేట్లను గుర్తించి వారి కారిడార్పై నిఘా పెడుతున్నది. గంజాయి ట్రాన్స్పోర్ట్ మార్గాలను గుర్తించారు. ఈ క్రమంలోనే ఈగల్ ఫోర్స్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ను ఏర్పాటు చేసుకుంది. గంజాయి సాగు, రవాణాకు కేంద్రాలలో ఒకటైన ఆంధ్ర–-ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లో సాగుచేసే గంజాయి అక్రమ రవాణాను అడ్డుకోవడంపై ఈ నెట్వర్క్ పనిచేస్తున్నది. భద్రాద్రి కొత్తగూడెం సహా ఒడిశా, ఏపీ ఏజెన్సీ ప్రాంతాల నుంచి రాష్ట్రంలోకి ప్రవేశించే అన్ని మార్గాల్లో పటిష్టమైన నిఘా వ్యవస్థను అమలు చేస్తున్నది.
ఏపీ, ఒడిశా, చత్తీస్గఢ్ బార్డర్స్లో సెర్చ్ ఆపరేషన్
ఈగల్ ఫోర్స్ ఒడిశాలోని జైపూర్ సమీపంలో ఉన్న డియోఘాటిలో భారీ ఆపరేషన్ చేసింది. మహారాష్ట్ర, -చత్తీస్గఢ్ సరిహద్దులోని కోల్కతా -బాంబే హైవేపై ఉన్న బాఘ్నడి గావ్ సమీపంలో గంజాయి వాహనాన్ని సీజ్ చేసింది. ఈ వరుస ఆపరేషన్లు రాష్ట్ర స్థాయిలో మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ అమలు చేస్తోంది. ఇందుకోసం అంతర్రాష్ట్ర సమన్వయంతో ఇంటెలిజెన్స్ సమాచారం చేకరిస్తోంది. చైన్ సిస్టమ్తో సాగుతున్న గంజాయి సిండికేట్లోని ప్రతి అంచెను ఛేదించే విధంగా ఈగల్ ఆపరేషన్స్ నిర్వహిస్తోంది. ఇలా మాధకద్రవ్యాల అక్రమ రవాణాను రాష్ట్ర సరిహద్దుల వద్దనే అడ్డుకుని ఏటా టన్నుల కొద్ది గంజాయిని, వాహనాలను స్వాధీనం చేసుకుని గంజాయి స్మగ్లర్లను అరెస్ట్ చేస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణ సరిహద్దులు సహా హైదరాబాద్ ఓఆర్ఆర్ మీదుగా గంజాయి ట్రాన్స్పోర్ట్ చేయాలంటే అంతర్రాష్ట్ర ముఠాల ఒంట్లో వణుకు పుడుతోందని అధికారులు చెబుతున్నారు.
ఈ ఏడాది కేంద్ర దర్యాప్తు సంస్థలతో కలిసి చేసిన భారీ ఆపరేషన్లు
ఈగల్ ఫోర్స్- ఎన్సీబీ జాయింట్ అపరేషన్: రాంచీలో 500 కిలోల గంజాయి పట్టివేత
ఈగల్ ఫోర్స్- ఒడిశా కోరాపుట్ సదర్ పోలీసులతో ఆపరేషన్: 500 కిలోల గంజాయిని స్వాధీనం
ఈగల్ ఫోర్స్- రాయ్పూర్,చత్తీస్గఢ్ సరిహద్దు సమీపంలో: 500 కిలోలు పట్టివేత
చత్తీస్గఢ్ - మహారాష్ట్ర సరిహద్దుల్లో : 500 కిలోల గంజాయి స్వాధీనం
డిమాండ్ తగ్గినప్పుడే సప్లయ్ చైన్ తెగిపోతుంది..
గంజాయి, డ్రగ్స్కు డిమాండ్ తగ్గినప్పుడే సప్లయ్ చైన్ తెగిపోతుంది. మన రాష్ట్రంలో గంజాయి అమ్మకాలను ఇప్పటికే భారీగా తగ్గించగలిగాం. మా ఫోకస్ అంతా ఏజెన్సీల నుంచి ఇతర రాష్ట్రాలకు ట్రాన్స్పోర్ట్ అవుతున్న గంజాయిపైనే. గంజాయిని తరలించేందుకు ఆర్గనైజ్డ్ నెట్వర్క్ పనిచేస్తోంది. ఈ నెట్వర్క్పై కేంద్ర దర్యాప్తు సంస్థలు, ఇంటెలిజెన్స్ వ్యవస్థతో వరుస దాడులు చేస్తున్నాము. ఈగల్ ఫోర్స్కు దేశంలో మంచి గుర్తింపు వచ్చింది.
- సందీప్ శాండిల్యా, డైరెక్టర్, ఈగల్ ఫోర్స్
