
తెలంగాణలో సంచలనం సృష్టించిన సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈడీ కేసు నమోదు చేసింది. పసిపిల్లల విక్రయాలు, ఫెర్టిలిటీ సెంటర్ మోసాలతో పలు రాష్ట్రాల్లో 4 నెలల్లో 5 వందల కోట్ల రూపాయల వరకు మనీలాండరింగ్ జరిగినట్లు గుర్తించారు. ఈ మేరకు ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రతను త్వరలో విచారించనున్నారు ఈడీ అధికారులు.
హైదరాబాద్ సహా 8 రాష్ట్రాల్లో సృష్టి కార్యకలాపాలు విస్తరించి ఉన్నట్టు గోపాలపురం పోలీసులు గుర్తించారు. నిరుపేద కుటుంబాల్లోని పిల్లలను కొనుగోలు చేసి, సంతానం లేనివారికి అమ్మినట్లు ఆధారాలు సేకరించారు. బాధితుల ఫిర్యాదులు ఆధారంగా ఇప్పటికే 9 కేసులను రిజిస్టర్ చేశారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే 30 మందిని అరెస్టు చేయగా రూ.40 కోట్లకు పైగా లావాదేవీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఈ డబ్బును వివిధ మార్గాల్లో మనీలాండరింగ్ చేసినట్లు ఆధారాలు సేకరించారు. పిల్లలను అమ్మి సరోగసీ, ఐవీఎఫ్ ద్వారా వారికి జన్మనిచ్చినట్లుగా నకిలీ ధ్రువపత్రాలు సృష్టించినట్లు పోలీసుల దర్యాప్తులో బయటపడింది.
ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రత, ఆమె భర్త సురేశ్, ఆమె చెల్లి కీర్తి సహా దాదాపు 50 మందికిపైగా సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ద్వారా భారీగా సంపాదించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. పిల్లల కొనుగోలుకు రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు ఖర్చు చేసి సరోగసీ పేరుతో రూ.20 లక్షల నుంచి రూ.40 లక్షలకు విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. 86 మందికిపైగా పిల్లల్ని చైల్డ్ ట్రాఫికింగ్ చేసినట్లు తేలింది. ఈ డబ్బును వివిధ మార్గాల ద్వారా మనీలాండరింగ్ చేశారన్న ఆరోపణలు రావడంతో ఈడీ దృష్టి పెట్టింది.