Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఫ్యామిలీ ఫోటోతో ఆసక్తి పెంచిన వెంకీ మామ

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఫ్యామిలీ ఫోటోతో ఆసక్తి పెంచిన వెంకీ మామ

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, విక్టరీ వెంకటేష్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆదర్శ కుటుంబం హౌస్ నం. 47’. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. కొత్త పోస్టర్‌ను విడుదల చేస్తూ, ఈ చిత్రాన్ని గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.

ఇప్పటివరకు ఈ సినిమా దసరా బరిలోకి దిగుతుందనే ఊహాగానాలు వినిపించినప్పటికీ, తాజా ప్రకటనతో అక్టోబర్ 2 రిలీజ్‌ను మేకర్స్ ఖరారు చేశారు. దీంతో త్రివిక్రమ్-వెంకటేష్ కాంబో కోసం ఎదురుచూస్తున్న అభిమానుల్లో మరింత ఆసక్తి నెలకొంది.

ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక, హాసిని క్రియేషన్స్ నిర్మిస్తోంది. ఇందులో వెంకీ సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటిస్తోంది. తాజా పోస్టర్లో వెంకీ తన ‘ఆదర్శ కుటుంబమైన’ ఫ్యామిలీ గ్రూప్ ఫోటో పంచుకోవడంతో క్యూరియాసిటీ పెరిగింది. ఇప్పటికే రిలీజైన టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ అభిమానులను ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. జులై నాటికి షూటింగ్ పూర్తి చేసి, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముగించి అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

త్రివిక్రమ్ డార్క్ క్రైమ్..

సాధారణంగా కుటుంబ కథలు, ఎమోషన్స్, పంచ్ డైలాగ్స్‌తో సినిమాలు చేసే త్రివిక్రమ్, ఈసారి “AK47” అనే టైటిల్ టచ్‌తో డార్క్ క్రైమ్ ఎలిమెంట్స్‌పై కూడా ఫోకస్ పెట్టడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు, ఇలాంటి డార్క్ షేడ్స్ ఉన్న పాత్రలో వెంకటేష్ కనిపించనున్నారని టాక్ రావడంతో అంచనాలు మరింత పెరిగాయి. అలాగే, ఈ సినిమాలో దివ్యేందు శర్మ కీలక పాత్ర పోషిస్తున్నారని సమాచారం.

‘మీర్జాపూర్’లో ‘మున్నా భయ్యా’ పాత్రతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న దివ్యేందు శర్మ, ఈ సినిమాలో నటిస్తున్నట్లు ఓ ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి ఆకట్టుకున్నాడు. ఇప్పుడు త్రివిక్రమ్ సినిమాలోనూ భాగమవ్వడం ఆసక్తిని పెంచుతోంది. త్వరలోనే దివ్యేందు శర్మ పాత్రపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

ఇక ఈ చిత్రంలో మరో హీరో నారా రోహిత్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నారని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. నెగెటివ్ షేడ్స్ ఉన్న పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఆయన నటించనున్నారని, కథలో ఇది చాలా ముఖ్యమైన క్యారెక్టర్ అని సమాచారం. పాత్ర నచ్చడంతో నారా రోహిత్ వెంటనే ఓకే చెప్పారని టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.