ఐపీఎల్ స్పాన్సర్‌‌షిప్‌ రేసులో మరో దేశీ కంపెనీ!!

ఐపీఎల్ స్పాన్సర్‌‌షిప్‌ రేసులో మరో దేశీ కంపెనీ!!

బిడ్డింగ్‌పై సీరియస్‌గా ఆలోచిస్తున్న అన్‌అకాడమీ
న్యూఢిల్లీ: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ వివో ఐపీఎల్ టైటిల్‌ స్పాన్సర్‌‌షిప్‌ హక్కుల నుంచి తప్పుకుంది. ఈ నేపథ్యంలో టోర్నీ స్పాన్సర్‌‌షిప్‌ హక్కులను దక్కించుకోవాలని అమెజాన్, జియో లాంటి బడా కంపెనీలతో పాటు పతంజలి లాంటి దేశీ సంస్థ కూడా యత్నిస్తోంది. తాజాగా ఈ రేసులోకి మరో దేశీ కంపెనీ అడుగుపెట్టింది. ఐపీఎల్‌ బిడ్డింగ్ కోసం ఎడ్యుకేషనల్ టెక్నాలజీ కంపెనీ అయిన అన్‌అకాడమీ యత్నిస్తోందని తెలిసింది. బెంగళూరు కేంద్రంగా అన్‌అకాడమీ ఆన్‌లైన్ ఎడ్యుకేషన్‌ క్లాసెస్‌ చెబుతోంది.

ఇప్పటికే ఐపీఎల్ స్పాన్సర్స్‌లో ఒకటిగా ఉన్న అన్‌అకాడమీ ఇప్పుడు మొత్తం టైటిల్ స్పాన్సర్‌‌షిప్ రైట్స్‌పై కన్నేసింది. బిడ్డింగ్ కోసం అన్‌అకాడమీ ట్రై చేస్తున్న విషయాన్ని బీసీసీఐకి చెందిన ఓ అధికారి కన్ఫర్మ్‌ చేశారని సమాచారం. ‘అన్‌అకాడమీ ఆసక్తి చూపింది. బిడ్ పేపర్లను కూడా తీసుకుంది. వాళ్లు బిడ్‌ను సమర్పించబోతున్నారని నేను విన్నా. దీనిపై వారు చాలా సీరియస్‌గా ఉన్నారు. ఒకవేళ బిడ్ దాఖలు చేస్తే పతంజలికి పోటీ తప్పదు’ అని బీసీసీఐకి చెందిన సీనియర్ అఫీషియల్ చెప్పారని తెలిసింది.