V6 News

హర్యానాలోనూ బీజేపీ సర్కారే

హర్యానాలోనూ బీజేపీ సర్కారే
  • జేజేపీ, ఇండిపెండెట్ల సపోర్టుతో ఖట్టర్​కు లైన్​క్లియర్​
  • అమిత్​ షాతో దుష్యంత్​ భేటీ.. జేజేపీకి డిప్యూటీ సీఎం పోస్టు ఇస్తామన్న బీజేపీ చీఫ్​
  • దీపావళి తర్వాత కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వం

చండీగఢ్/​న్యూఢిల్లీ: మహారాష్ట్రలో శివసేనతో కలిసి అధికారాన్ని నిలబెట్టుకున్న బీజేపీ హర్యానాలోనూ సర్కార్​ ఏర్పాటుకు రెడీ అయింది. మ్యాజిక్​ ఫిగర్​కు ఆరు సీట్ల దూరంలో ఆగిపోయిన బీజేపీకి 10 మంది ఎమ్మెల్యేలున్న జననాయక్​ జనతా పార్టీ(జేజేపీ) మద్దతియ్యడంతో శుక్రవారం సీన్​ ఒక్కసారిగా మారిపోయింది. జేజేపీ చీఫ్​ దుష్యంత్​ చౌతాలా ఢిల్లీలో బీజేపీ చీఫ్​ అమిత్​ షాను కలిసి మద్దతిస్తామని చెప్పగా, ప్రతిగా జేజేపీకి డిప్యూటీ సీఎం పోస్టు ఇస్తామని షా ప్రకటించారు.

జేజేపీ కంటే ముందే ఆరుగురు ఇండిపెండెట్లు, హర్యానా లోక్​హిత్​ పార్టీ(హెచ్​ఎల్​పీ) ఎమ్మెల్యే గోపాల్​ కందా కూడా బీజేపీకి బేషరతుగా మద్దతిస్తామని ప్రకటించారు. నాన్​ బీజేపీ ఎమ్మెల్యేల సపోర్టుతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తామని ముందే ప్రకటించిన కాంగ్రెస్​ పార్టీ.. ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టకముందే బీజేపీ చకచకా పావులు కదిపింది. ఢిల్లీలో మకాం వేసిన హర్యానా ఇండిపెండెంట్​ ఎమ్మెల్యేలతో శుక్రవారం ఉదయం సీఎం ఖట్టర్​ మంతనాలు జరిపారు. ఎనిమిది మంది ఇండిపెంట్లలో ఆరుగురు బీజేపీ రెబల్సే కావడం, మిగతా ఇద్దరికీ ఆర్​ఎస్​ఎస్​తో బలమైన అనుబంధం ఉండటంతో చర్చల ప్రక్రియ ఈజీగా సాగినట్లు పార్టీ వర్గాలు చెప్పాయి.  ఆ వెంటనే ఖట్టర్​ ఒకరిద్దరు ఎమ్మెల్యేల్ని వెంటతీసుకుని బీజేపీ నేషనల్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ జేపీ నడ్డాను కూడా కలిశారు.

ఇవాళ గవర్నర్​ను కలవనున్న ఖట్టర్​

చండీగఢ్​లో శనివారం ఉదయం 11 గంటలకు హర్యానా బీజేపీ లెజిస్లేటివ్​ పార్టీ భేటీ కానుంది. 40 మంది ఎమ్మెల్యేలు ఖట్టర్​ను నేతగా ఎన్నుకోనున్నారు. ఈ సమావేశానికి హైకమాండ్​ పరిశీలకులుగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ హాజరుకానున్నారు. శుక్రవారంనాడే గవర్నర్ సత్యదేవ్​ నారాయణ్​ ఆర్య​ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించాల్సిందిగా కోరతానని సీఎం ఖట్టర్​ వెల్లడించారు. జేజేపీ సపోర్టుతో ఏర్పడనున్న బీజేపీ కొత్త సర్కారు దీపావళి తర్వాత కొలువుదీరుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి.

కందా  సపోర్ట్‌‌‌‌‌‌‌‌ తీసుకోవద్దు

వివాదాస్పద నేతగా పేరున్న గోపాల్​ కందా సపోర్టు తీసుకోవడంపై బీజేపీలోనే వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ఎయిర్​హోస్టెస్​ గీతికా శర్మ మృతి కేసులో కందాపై తీవ్రస్థాయి ఆరోపణలుండటమే ఇందుకు కారణం. ఎండీఆర్​ఎల్​ అనే​ ఏవియేషన్​ కంపెనీ ఓనరైన కందా గతంలో భూపిందర్​ హుడా(కాంగ్రెస్​) కేబినెట్​లో మంత్రిగానూ పనిచేశారు. ఎయిర్​హోస్టెస్​ గీతికను కందానే రేప్​చేసి చంపేశారనే ఆరోపణలు రావడంతో ఆయన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సివచ్చింది. తర్వాతికాలంలో ఆయన బీజేపీకి దగ్గరయ్యారు.  హర్యానాలో సర్కార్‌‌‌‌‌‌‌‌ ఏర్పాటుకు కందా సపోర్ట్​ తీసుకోవద్దని బీజేపీ సీనియర్​ నేత,  కేంద్ర మాజీ మంత్రి ఉమాభారతి సొంత పార్టీ నేతల్ని తీవ్రంగా హెచ్చరించారు. అధికారం కోసం నైతిక విలువల పునాదుల్ని మరిచిపోవద్దని, మంచివాళ్లను మాత్రమే కలుపుకొని వెళ్లాలని  సూచించారు.  ‘‘గోపాల్ కందా వల్ల ఓ అమ్మాయి సూసైడ్‌‌‌‌‌‌‌‌ చేసుకుంది.  ఆ తర్వాత ఆమె తల్లి కూడా ఆత్మహత్య చేసుకుంది. ఆ కుటుంబానికి ఇప్పటికీ న్యాయం జరగలేదు. కందా నేరస్తుడా, అమాయకుడా అనేది సాక్ష్యాల ఆధారంగా కోర్టు నిర్ణయిస్తుంది. ఒక నిందితుడు ఎన్నికల్లో గెలవడానికి ఎన్నో కారణాలుండొచ్చు, అంతమాత్రాన ఆ వ్యక్తి నిర్దోషి అయినట్లుకాదు”అని ఉమాభారతి శుక్రవారం ఘాటుగా ట్వీట్​ చేశారు.

సోనియా మీటింగ్​ పెట్టినా..

మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్​ పెర్ఫామెన్స్​పై పార్టీ తాత్కాలిక చీఫ్​ సోనియా గాంధీ శుక్రవారం ముఖ్యనేతలతో సమావేశం నిర్వహిస్తారని ఏఐసీసీ వర్గాలు ముందే ప్రకటించాయి. ఈ భేటీకి మాజీ ప్రధాని మన్మోహన్​ సింగ్​, రాహుల్​ గాంధీ, ఆజాద్​, కేసీ వేణుగోపాల్​, అంబికా సోని, జ్యోతిరాదిత్య, ఏకే ఆంటోనీ తదితర నేతలు హాజరయ్యారు. మీటింగ్​ వివరాలను మీడియాకు వెల్లడించిన కాంగ్రెస్​ అధికార ప్రతినిధి రణదీప్​ సుర్జేవాలా హర్యానా అంశంపై దాటవేతధోరణి ప్రదర్శించారు. సోనియా మీటింగ్​లో కేంద్ర సర్కార్​ విధానాలపైనే ఎక్కువ చర్చ జరిగిందని, చైనాతో కలిసి ‘సమగ్ర ప్రాంతీయ ఆర్థిక భాగస్వామ్యం (ఆర్​సీఈపీ)’లో చేరాలన్న మోడీ నిర్ణయం దేశ రైతులపై పెను ప్రభావం చూపుతుందని, ఆర్​సీఈపీకి వ్యతిరేకంగా పోరాడాలని సోనియా నిర్దేశించినట్లు సుర్జేవాలా వెల్లడించారు.

కీలక పాత్ర పోషిస్తాం: దుష్యంత్

శుక్రవారం మధ్యాహ్నం ఢిల్లీలో జరిగిన జేజేపీ లెజిస్లేటివ్​ మీటింగ్​లో ఎమ్మెల్యేలు దుష్యంత్​ చౌతాలాను నేతగా ఎన్నుకున్నారు. మీటింగ్‌‌కు ముందు దుష్యంత్​ తీహార్‌‌ జైల్లో ఉన్న తండ్రి అజయ్‌‌ చౌతాలను కలుసుకున్నారు. రాత్రి ఎనిమిది గంటల తర్వాత కేంద్ర మంత్రి అనురాగ్​ ఠాకూర్​ బీజేపీ దూతగా దుష్యంత్​తో చర్చలు జరిపారు. అక్కణ్నుంచి ఇద్దరు నేతలు నేరుగా అమిత్​ షా ఇంటికి వెళ్లారు. అప్పటికే అక్కడికి హర్యానా సీఎం ఖట్టర్​, ఇతర ముఖ్యనేతలు చేరుకున్నారు. పదవుల పంపకంపై డీల్​ కుదిరిన తర్వాత నేతలందరూ జాయింట్​గా మీడియాతో మాట్లాడారు. హర్యానా ప్రజలిచ్చిన తీర్పుకు అనుగుణంగా రెండు పార్టీల నేతలు నేతలు జరిపిన చర్చలు సక్సెస్​ అయ్యాయని, సీఎం పోస్టు బీజేపీ, డిప్యూటీ సీఎం పోస్టు జేజేపీ చేపడతాయని అమిత్ షా ప్రకటించారు. డిప్యూటీతో పాటు మరో రెండు మంత్రి పదువులు ఇచ్చేందుకూ బీజేపీ హైకమాండ్​ ఓకే చెప్పినట్లు తెలిసింది.  హర్యానాలో సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలన్న ఉద్దేశంతోనే బీజేపీతో చేతులుకలిపానని దుష్యంత్​ చెప్పారు. బీజేపీ ప్రభుత్వంలో భాగస్వామిగా అవకాశం కల్పంచినందుకు అమిత్​ షా, నడ్డాలకు థ్యాంక్స్​ చెప్పారు.  తాము కీలక పాత్ర పోషిస్తామని చెప్పారు. దుష్యంత్​ తాత ఓం ప్రకాశ్​ చౌతాలా, తండ్రి అజయ్​ చౌతాలా అవినీతి కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్న నేపథ్యంలో ఆయన బీజేపీ దగ్గరకావడం కొత్తచర్చకు తెరలేపింది.