రూ. లక్షలోపు రుణమాఫీకి ఉండాల్సిన అర్హతలివే..

రూ. లక్షలోపు రుణమాఫీకి ఉండాల్సిన అర్హతలివే..

తెలంగాణ ప్రభుత్వం లక్ష రూపాయల లోపు ఉన్న రైతుల రుణమాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది.  సోమవారం (ఆగస్టు 14న) ఒకే రోజు 10 లక్షల 79  వేల 721 మంది రైతుల రూ.6 వేల 546 కోట్ల 5 లక్షల రుణాలను మాఫీ చేసింది.

రూ.లక్ష వరకు క్రాప్​లోన్లు మాఫీ చేస్తామని బీఆర్ఎస్​ప్రభుత్వం గతంలో ప్రకటించింది. ఇందుకు 2018 డిసెంబర్ 11ను కటాఫ్‌‌ తేదీగా నిర్ణయించింది. ఆ తేదీ నాటికి రాష్ట్రంలో 40.66 లక్షల మంది రైతులకు చెందిన లోన్లు మొత్తం రూ.25,936 కోట్లు ఉన్నట్లు బ్యాంకులు తేల్చాయి. అయితే రైతులు, వారి కుటుంబ సభ్యులపై కలిపి మొత్తంగా ఒక లక్ష రూపాయలు మాత్రమే మాఫీ చేస్తామని ప్రభుత్వం రెండేండ్ల కింద నిబంధన తీసుకువచ్చింది. దీంతో 3.98 లక్షల మంది రైతులు అనర్హులయ్యారు. 

దీంతో రాష్ట్రంలో మొత్తంగా 36.68 లక్షల మంది రైతులకు చెందిన రుణాలు మాఫీ చేయడానికి రూ.19,198.38 కోట్లు అవసరమని సర్కార్ నిర్ణయించింది. సోమవారం రూ.99,999 వరకు లోన్ ఉన్న 10.79 లక్షల మంది రైతులకు సంబంధించిన రుణాల మాఫీ కోసం ప్రభుత్వం రూ.6,546.05 కోట్లు రిలీజ్​చేసింది. దీంతో ఇప్పటి వరకు మొత్తం 16.66 లక్షల మందికి రైతులకు సంబంధించిన రూ.7753.43 కోట్ల క్రాప్​లోన్లు మాఫీ చేసినట్లయింది. అయితే ఇంకా 14.34 లక్షల మంది రైతులకు సంబంధించి రూ.లక్ష వరకు ఉన్న రుణాలు పెండింగ్ ఉన్నాయి. వీటిని మాఫీ చేయాలంటే రూ.11,445.95 కోట్లు అవసరం.

నిధుల విడుదల ఇలా

2018లో ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతు రుణ మాఫీ నాలుగు దఫాలుగా చేస్తామని ప్రకటించింది. కానీ ఈ నాలుగున్నర ఏండ్లలో 5.66 లక్షల మంది రైతుల లోన్ల మాఫీకి రూ.1,207 కోట్లు రిలీజ్​చేసింది. తాజాగా ఈ ఆగస్టు నెల నుంచి కొద్దికొద్దిగా మాఫీ చేస్తూ వస్తున్నది. 3వ తేదీన రూ.237. 85 కోట్లు, 4వ తేదీన రూ.126.50కోట్లు బ్యాంకుల్లో జమ చేసింది. సోమవారం రూ.లక్ష లోపు క్రాప్​లోన్ల మాఫీ కోసం రూ.6,546.05 కోట్లను విడుదల చేసింది.