
కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఎమర్జెన్సీ’. దేశ చరిత్రలో చీకటి రోజులుగా పిలిచే ఎమర్జెన్సీ నాటి పరిస్థితుల ఆధారంగా దీన్ని రూపొందిస్తున్నారు. ఇందులో ఇందిరాగాంధీ పాత్రలో కంగనా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన తన లుక్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. జూన్ 14న ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. అయితే గురువారం ఈ సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు.
హిమాచల్ ప్రదేశ్లోని మండి లోక్ సభ అభ్యర్థిగా బీజేపీ తరపున కంగన పోటీ చేస్తున్న క్రమంలో మూవీ రిలీజ్ను వాయిదా వేశారు. ప్రస్తుతం కంగన పూర్తి ప్రాధాన్యతను రాజకీయాలకు ఇస్తోందని, అందుకే సినిమా రిలీజ్ను వాయిదా వేస్తున్నామని, త్వరలో కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని తెలియజేశారు. నిజానికి గత ఏడాది నవంబర్లో రిలీజ్ కావాల్సి ఉండగా జూన్కు వాయిదా వేశారు. ఇప్పుడు మరోసారి వాయిదా పడింది.
జీ స్టూడియోస్తో కలిసి కంగనకు చెందిన మణికర్ణిక ఫిలిమ్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. అనుపమ్ ఖేర్, మహిమా చౌదరి, మిలింద్ సోమన్, శ్రేయాస్ తల్పాడే ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.