సికింద్రాబాద్, వెలుగు: గంజాయికి బానిసైన ఇంజినీరింగ్ రెండో సంవత్సరం స్టూడెంట్ రైలు కిందపడి సూసైడ్ చేసుకున్నాడు. సికింద్రాబాద్ రైల్వే ఇన్స్పెక్టర్ శ్రీను తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం గుర్తు తెలియని యువకుడు ఘట్ కేసర్, సనత్ నగర్ రైల్వే స్టేషన్ల మధ్య రైలు పట్టాలపై సూసైడ్ చేసుకున్నాడు. మృతుడి వద్ద లభించిన డ్రైవింగ్ లైసెన్సు ఆధారంగా చర్లపల్లికి చెందిన శ్రీనివాస్ కుమారుడు విజయ్ కుమార్ (27) గా గుర్తించారు. విజయ్ ఘట్కేసర్లోని ప్రిన్స్టన్ కాలేజీలో డిప్లొమా చదివే సమయంలో గంజాయికి అలవాటు పడ్డాడు.
సిటీలోని మెథడిస్ట్ ఇంజినీరింగ్ కాలేజీలో జాయిన్ చేయించగా అక్కడ గంజాయికి బానిసై అన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యాడు. దీంతో చర్లపల్లిలో తండ్రి శ్రీనివాస్ విజయ్కు చికెన్ సెంటర్ పెట్టించాడు. అయినా గంజాయి తాగడం మానలేదు. తండ్రి కౌన్సిలింగ్ ఇప్పించగా కొద్దిగా కోలుకున్న విజయ్ మళ్లీ చదువుకుంటానని అనడంతో నారపల్లి సమీపంలోని ఇంజినీరింగ్ కాలేజీలో మెకానికల్ రెండో సంవత్సరంలో చేర్పించాడు. కాగా కొన్ని రోజులుగా విజయ్ ఆత్మహత్య చేసుకుని చనిపోతానని అంటున్నాడని తండ్రి తెలిపారు. ఒకవైపు కౌన్సిలింగ్ ఇప్పిస్తుండగా ఆత్మహత్య చేసుకున్నాడని తండ్రి శ్రీనివాస్ రోదించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.