ఉద్యోగులకు శుభవార్త. అత్యవసర సమయంలో పీఎఫ్ డబ్బులు డ్రా చేయాలంటే ఆఫీసుల చుట్టూ తిరగడం, వారాల తరబడి వేచి చూసే రోజులకు కాలం చెల్లనుంది. దేశంలోని సుమారు 7 కోట్ల మంది ఈపీఎఫ్ సభ్యుల కష్టాలకు చెక్ పెడుతూ.. EPFO సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. పీఎఫ్ క్లెయిమ్ల ప్రక్రియను పూర్తిగా సులభతరం చేస్తూ ‘ఆటో సెటిల్మెంట్’ సిస్టమ్ను తీసుకొచ్చింది. ఈ ప్రకటన వెలువడిన వెంటనే గూగుల్ ట్రెండ్స్లో ‘ఆటో సెటిల్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ క్లెయిమ్స్’ అనే సెర్చ్ ఇంట్రెస్ట్ ఒక్కసారిగా పీక్స్కు చేరింది. దీని గురించి ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి..
అసోచామ్ నిర్వహించిన నేషనల్ సెమినార్లో సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ రమేష్ కృష్ణమూర్తి ఈ కీలక మార్పులను అధికారికంగా ప్రకటించారు. ఈ సరికొత్త ఆటో-సెటిల్మెంట్ విధానంలో.. ఉద్యోగుల పీఎఫ్ విత్డ్రా క్లెయిమ్లను సిస్టమే ఆటోమెటిక్ గా ప్రాసెస్ చేస్తుంది. దీని వెనుక ఎలాంటి ఈపీఎఫ్ఓ అధికారుల మాన్యువల్ వెరిఫికేషన్ లేదా సంతకాలు అవసరం లేదు. దీనివల్ల గతంలో వారాల తరబడి పట్టిన ప్రాసెస్ టైమ్ కాస్తా.. ఇప్పుడు కేవలం కొన్ని రోజుల్లోనే పూర్తి కానుంది. డబ్బులు నేరుగా ఉద్యోగి ఖాతాలో జమ అవుతాయి.
ఈ ఆటో-సెటిల్మెంట్ సదుపాయం కేవలం 5 లక్షల రూపాయల లోపు అడ్వాన్స్, పార్షియల్ విత్డ్రాయల్స్కు మాత్రమే అందుబాటులో ఉంది. ఉద్యోగి కేవైసీ, ఐడెంటిటీ కార్డులు, ప్యాన్, బ్యాంక్ వివరాలు పక్కాగా ఉంటే మూడు రోజుల్లోనే ఈ క్లెయిమ్స్ సెటిల్ అయిపోతున్నాయి. ఇప్పుడు ఈ క్రేజీ ఫీచర్ను ఫైనల్ పీఎఫ్ విత్డ్రాయల్స్కు కూడా వర్తింపజేయాలని ఈపీఎఫ్ఓ ప్లాన్ చేస్తోంది. దీనివల్ల రిటైర్ అయిన ఉద్యోగులు ఎలాంటి పేపర్వర్క్ లేకుండానే తమ జీవితకాల పొదుపు మొత్తాన్ని క్షణాల్లో తిరిగి అందుకోవచ్చు.
అలాగే ఉద్యోగాలు మారే వారికి కూడా ఈపీఎఫ్ఓ మరో అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. సాధారణంగా కంపెనీ మారినప్పుడు పాత పీఎఫ్ బ్యాలెన్స్ను కొత్త కంపెనీ అకౌంట్లోకి మార్చుకోవడానికి ఉద్యోగులు ప్రత్యేకంగా ట్రాన్స్ఫర్ ఫారాలు నింపి నానా తంటాలు పడాల్సి వచ్చేది. ఇకపై ఆ తలనొప్పి ఉండదు. కొత్త విధానంలో ఉద్యోగి కంపెనీ మారిన వెంటనే సిస్టమే ఆటోమేటిక్గా పాత పీఎఫ్ ఖాతాను కొత్త కంపెనీ అకౌంట్కు లింక్ చేసి.. డబ్బును ట్రాన్స్ఫర్ చేస్తుంది.
దీనితో పాటు, ప్రభుత్వం తీసుకురానున్న కొత్త లేబర్ కోడ్ ఫ్రేమ్వర్క్ పరిధిలోకి 1952 నాటి ఈపీఎఫ్ స్కీమ్, 1976 నాటి డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్, 1995 నాటి పెన్షన్ స్కీమ్లను కూడా తీసుకురానున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని నోటిఫికేషన్లు త్వరలోనే విడుదల కానున్నాయి. మొత్తానికి లీగల్ ఫ్రేమ్వర్క్ను మారుస్తూ.. టెక్నాలజీని వాడుకుంటూ ఈపీఎఫ్ఓ తీసుకొస్తున్న ఈ రిఫార్మ్స్ అటు కంపెనీలకు, ఇటు ఉద్యోగులకు ఒక పెద్ద రిలీఫ్ అని చెప్పాలి.
