ఒంగోలు: పట్టపగలు యువకుడిని దారుణంగా హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఒంగోలు లోని గాంధీ పార్క్ వద్ద ఓ యువకుడిని ఇద్దరు వ్యక్తులు కత్తితో అత్యంత దారుణంగా పొడిచి చంపేశారు. ఒంగోలు పట్టణానికి చెందిన ఓ షాపింగ్ మాల్లో పనిచేసే థామస్ అనే వ్యక్తికి గతంలో ఓ మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ విషయం ఆ మహిళ భర్తకు తెలియడంతో వారిద్దరి మధ్య కొద్ది రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. అయితే తమ మధ్య గొడవలు జరగడానికి థామస్ కారణమని భావించిన ఆ దంపతులు అతన్ని హత్య చేయాలని ప్లాన్ వేశారు.
పథకం ప్రకారం మంగళవారం ఉదయం థామస్కు ఫోన్ చేసిన ఆ మహిళ అతన్ని గాంధీ పార్క్ వద్దకు రావాలని కోరింది. అయితే థామస్ అక్కడికి రాగానే ఆ మహిళ, ఆమె భర్త అతనిపై కత్తితో దాడి చేశారు. అనంతరం దంపతులిద్దరు పోలీసు స్టేషన్కు వెళ్లి లొంగిపోయారు. దీంతో పోలీసులు హత్య జరిగిన ప్రదేశానికి వెళ్లి వివరాలు సేకరించారు. ఘటన స్థలాన్ని పరిశీలించి.. థామస్ మృతదేహాన్ని ఒంగోలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.