- ఏడెనిమిదేండ్లకే కంటి సమస్యలు
- వందలో 25 మందికి ఇదే సమస్య
- ఫోన్లు, డెస్క్టాప్ అతి వాడకంతో నియర్ సైట్ ప్రాబ్లమ్
హైదరాబాద్, వెలుగు:
క్లాస్లో టీచర్ బోర్డుపై ఏం రాస్తోందో పిల్లలకు కన్పించడం లేదు. దూరంగా ఉన్న వస్తువులు మసగ్గా కన్పిస్తున్నాయి. కనిపించీ కనిపించని బోర్డు చూసి సాయంత్రం ఇంటికొస్తూనే పిల్లలు తలనొప్పి అంటూ డీలా పడిపోతున్నారు. ఈ లక్షణాలకు కారణం పిల్లల్లో ‘నియర్ సైట్’. అంటే దగ్గర ఉన్నవి కనిపించి దూరంగా కనిపంచకపోవడం. రోజుకు రెండు మూడు గంటలు, సండే వస్తే ఐదారు గంటలు స్మార్ట్ ఫోన్ వాడడం, అదే పనిగా టీవీ చూడడంతో చిన్న వయసులోనే కంటిచూపు మందగిస్తోంది. దీంతో పసి వయసులోనే కళ్లద్దాలు తప్పడం లేదు. ఒకటి, రెండో క్లాస్ పిల్లల్లోనూ ఈ తరహా సమస్యలు రావడం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో ప్రతి వందలో 25 మంది పిల్లలది ఇప్పుడిదే పరిస్థితి అని డాక్టర్లు చెబుతున్నారు. అతిగా స్మార్ట్ఫోన్ వాడుతున్న పెద్దలు కూడా కళ్లద్దాలు లేనిదే స్ర్కోలింగ్ కూడా చదవలేకపోతున్నారు. రోజులో ఎక్కువశాతం కండ్లకు దగ్గరగా ఉన్న వస్తువుల్ని, స్క్రీన్నే చూడడం, నాలుగు గోడల మధ్యే గడుపుతుండడంతో కొంత కాలానికి దూరపు చూపు కోల్పోతున్నారని డాక్టర్లు చెబుతున్నారు. 50% నుంచి 60% మంది పిల్లలు ఏదో ఒక స్థాయిలో విటమిన్ లోపంతో బాధపడుతున్నారు. పాలు, ఆకుకూరలు, పండ్లు తినకపోవడంతో విటమిన్–ఏ అందడంలేదు. ప్రతి ఆర్నెళ్లకోసారి విటమిన్–ఏ డ్రాప్స్ వేయించాల్సి ఉన్నా.. గవర్నమెంట్ ఆస్పత్రుల్లో రెండేండ్ల నుంచి సక్రమంగా డ్రాప్స్ పంపిణీ చేయడంలేదు.
50,37,117 మందికి కంటి జబ్బులు
రాష్ట్రంలో ‘కంటి వెలుగు’ అర్ధంతరంగా అటకెక్కింది. 1.54 కోట్ల మందికి కంటి పరీక్షలు చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో 32.56 శాతం.. అంటే 50,37,117 మందికి వివిధ రకాల కంటి జబ్బులున్నట్టు డాక్టర్లు గుర్తించారు. ఇందులో సుమారు 20 లక్షల మంది పిల్లలే. ఈ లెక్కన రాష్ట్రంలో ప్రతి వందలో 30 నుంచి 35 మంది కంటి జబ్బులతో బాధపడుతున్నారని అంచనా. కంటి వెలుగు కింద టెస్టులు చేయించుకున్న వారిలో 6,42,290 మందికి కాటరాక్ట్ (శుక్లాలు) ఆపరేషన్లు, 3,16,976 మందికి పెద్దాపరేషన్లు అవసరమని డాక్టర్లు తేల్చారు. అయితే, వీళ్లలో 10 వేల మందికి కూడా ఆపరేషన్లు చేయించకుండానే ‘కంటి వెలుగు’ పథకం బంద్ అయింది. ‘పిల్లలు, యంగర్స్ రాత్రి పడుకునేముందు ఎక్కువసేపు సెల్ ఫోన్తో గడుపుతున్నారు. ఫోన్ స్ర్కీన్ లైట్ నేరుగా కంటిపై పడడం, రేడియేషన్ ఎఫెక్ట్తో కంటిలోని సున్నితమైన పొరలు దెబ్బతింటున్నాయి. కొందరు చాలినంత నిద్రపోవడం కూడా లేదు. దీంతో కండ్లకు రెస్ట్ దొరకడం లేదు.’ అని డాక్టర్ అమర్సింగ్ నాయక్ వివరించారు.
ఇలా చేయాలె
- స్ర్కీన్ టైమ్ తగ్గించాలి. అవసరమైతే తప్ప ఫోన్లో వీడియోలు చూడొద్దు.
- ఫోన్లో, ల్యాప్టాప్, డెస్క్టాప్లలో సినిమాలు చూడటం తగ్గించాలి.
- సోషల్ మీడియా వినియోగానికి రోజూ కొంత టైమ్ లిమిట్ పెట్టుకోవాలి.
- వీలును బట్టి వారానికి ఒకటి లేదా రెండ్రోజులు స్ర్కీన్ (ఫోన్ లేకుండా) చూడకుండా గడపాలి.
- రోజూ కొంతసేపు లాంగ్ వ్యూ కోసం మైదాన ప్రాంతాల్లో, పార్కుల్లో గడపాలి.