మోసగాళ్లు: పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయని.. రూ.74 లక్షలు కొట్టేసిన కేటుగాళ్లు

మోసగాళ్లు: పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయని.. రూ.74 లక్షలు కొట్టేసిన కేటుగాళ్లు

బషీర్​బాగ్​, వెలుగు: పెట్టుబడికి లాభాలు వస్తాయని ఓ వ్యక్తిని సైబర్ చీటర్స్ మోసగించారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ శివమారుతి తెలిపిన ప్రకారం.. సైదాబాద్ ప్రాంతానికి చెందిన 50 ఏళ్ల వ్యక్తికి గత నెల 18న సైబర్​ నేరగాళ్లు వాట్సాప్​లో మెసేజ్ చేశారు. 

సెటాడేల్, యాక్సిస్ సెక్యూరిటీస్ లో ఇన్వెస్ట్ చేస్తే 20 శాతం ప్రాఫిట్​ వస్తుందని చెప్పారు. వాటి లింక్స్ పంపగా బాధితుడు రూ.2 లక్షలు ఇన్వెస్ట్ చేశాడు. ఇందుకు రూ.16 వేలు ప్రాఫిట్​గా ఇచ్చారు. అలా నమ్మకం  పెంచి ఐవోపీ స్టాక్స్ పై ఇన్వెస్ట్ చేస్తే భారీగా లాభాలు వస్తాయని ఆశ చూపారు. బాధితుడు మే 23 నుంచి జూన్ 13 వరకు పలు దఫాలుగా సెటాడేల్ లో రూ.31 లక్షలు, యాక్సిస్ సెక్యూరిటీస్ లో రూ.43.30 లక్షలు.. మొత్తంగా రూ.74 లక్షల 30 వేలు ఇన్వెస్ట్ చేశాడు. 

నకిలీ యాప్ ద్వారా  సెటాడేల్ లో రూ.1.26 కోట్లు, యాక్సిస్ సెక్యూరిటీస్ లో రూ.2.62 కోట్లు బ్యాలెన్స్ చూపించారు. విత్ డ్రా చేయడానికి ప్రయత్నించగా మరింత ఇన్వెస్ట్ చేయాలని స్కామర్స్​ ఒత్తిడి తెచ్చారు. డబ్బుల్​ విత్​డ్రా కాకపోవడంతో స్కామ్​ అని గ్రహించిన బాధితుడు సైబర్​క్రైంకు ఫిర్యాదు చేశాడు. అప్పటికే రూ.74.30 లక్షలు పోగొట్టుకున్నాడు.