కి‘లేడీ’ మోసం :ఉద్యోగాల పేరుతో కోట్లు వసూలు చేసింది

కి‘లేడీ’ మోసం :ఉద్యోగాల పేరుతో కోట్లు వసూలు చేసింది

మంచిర్యాల, వెలుగుగురుకుల పాఠశాలల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని ఓ మహిళ ఘరానా మోసానికి పాల్పడింది. మాయమాటలతో పలువురు నిరుద్యోగులను నమ్మించి రూ. కోట్లను వసూలు చేసింది. తెలివిగా వారి వద్ద అప్పు తీసుకున్నట్టు కాగితాలు కూడా రాసిచ్చింది.  ఇప్పుడు వారందరికీ ఐపీ నోటీసులు పంపి షాక్​ ఇచ్చింది.  దీంతో బాధితులు లబోదిబోమంటూ సోమవారం పోలీసులను ఆశ్రయించారు.  తమకు న్యాయం చేయాలని మంచిర్యాల డీసీపీ రక్షిత కె.మూర్తికి ఫిర్యాదు చేశారు.  ఈ మోసంపై సమగ్రంగా దర్యాప్తు చేసి తగిన చర్యలు తీసుకోవాలని డీసీపీ..  సీఐని ఆదేశించారు.

జరిగింది ఇలా..

బాధితులు తెలిపిన వివరాల ప్రకారం…  బెల్లంపల్లి పట్టణానికి చెందిన ఠాకూర్​ సుమలత.. తాను తాండూర్​ కేజీబీవీలో ఏఎస్​వోగా పని చేస్తున్నానని అందరిని నమ్మించింది.  బెల్లంపల్లితో పాటు జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన నిరుద్యోగులను టార్గెట్​చేసుకొని..  గురుకుల స్కూళ్లలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడింది.  ఒక్కొక్కరి దగ్గరి నుంచి రూ.లక్ష నుంచి రూ.5లక్షల వరకు వసూలు చేసింది.  ఇలా జిల్లావ్యాప్తంగా 150 మందికిపైగా సుమలతకు సొమ్మును సమర్పించుకున్నారు.  ఈ మొత్తం రూ.5కోట్లకు పైగా ఉంటుందని అంచనా..  ఒకవేళ ఉద్యోగం ఇప్పించకపోతే ఎవరి డబ్బులు వాళ్లకు తిరిగి ఇస్తానని కూడా చెప్పింది.  ఇందుకు నిరుద్యోగులను నమ్మించేందుకు వారి దగ్గర అప్పు తీసుకున్నట్టు ప్రామిసరీ నోట్లు, బాండ్ ​పేపర్లు కూడా రాసిచ్చింది.

పలువురికి పోస్ట్​ డేటెడ్​ చెక్కులు ఇచ్చింది.  అయితే ఏండ్లు గడుస్తున్నా ఉద్యోగాల ఊసు లేకపోవడంతో  పలువురు బాధితులు ఆమె ఇంటిచుట్టూ తిరగడం మొదలు పెట్టారు. ఉద్యోగం ఇప్పించాలని, లేదంటే పైసలు వావస్​ ఇవ్వాలని ఒత్తిడి తెచ్చారు. దీంతో నెలరోజులుగా ఆమె అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది.  కొందరికి కోర్టు ద్వారా ఐపీ (ఇన్​సాల్వెన్సీ ప్రొసీడింగ్స్​​) నోటీసులు పంపించింది. అప్పు తీసుకున్నానే తప్పా.. ఉద్యోగాల కోసం డబ్బలు తీసుకోలేదని ఆధారాలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంది. పలువురికి ఐపీ నోటీసులు రావడం, నెల రోజులుగా సుమలత కనిపించకపోవడం.. సెల్​ఫోన్​ స్విచ్చాఫ్​ రావడంతో నిరుద్యోగులు కంగుతిన్నారు.  చేసేదేమీ లేక తమకు న్యాయం చేయాలని సుమలతపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆశ్రయించారు.