రైతుల ఆందోళన జాతీయ సమస్యగా మారొచ్చు: సుప్రీం

రైతుల ఆందోళన జాతీయ సమస్యగా మారొచ్చు: సుప్రీం

న్యూఢిల్లీ: కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు దేశ రాజధాని ఢిల్లీలో నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులను తరలించాలన్న పిటిషన్​పై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఢిల్లీకి చెందిన రిషబ్ శర్మ దాఖలు చేసిన పిటిషన్ పై చీఫ్ జస్టిస్ ఎస్.ఏ బొబ్డే ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. వివాద పరిష్కారానికి కమిటీని ఏర్పాటు చేసే యోచనలో ధర్మాసనం ఉన్నట్లు తెలుస్తోంది.

రైతు సంఘాలు, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులతో కమిటీ వేస్తామని సుప్రీం తెలిపింది. రైతుల ఆందోళన జాతీయ సమస్యగా మారే ప్రమాదం ఉందని అత్యున్నత ధర్మాసనం అభిప్రాయపడింది. అన్నదాతల ఆందోళనలకు సంబంధించిన అన్ని పిటిషన్లను కలిపి విచారిస్తామని పేర్కొంది. నిరసనలు చేస్తున్న రైతు సంఘాలను పార్టీలుగా ఇంప్లీడ్ చేసేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. రేపటిలోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించిన సుప్రీం.. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.