ఇథనాల్‌‌ ఫ్యాక్టరీ విధ్వంసం కేసులో రైతులకు బేడీలు.. ముగ్గురు పోలీసులు సస్పెండ్

ఇథనాల్‌‌ ఫ్యాక్టరీ విధ్వంసం కేసులో రైతులకు బేడీలు.. ముగ్గురు పోలీసులు సస్పెండ్

గద్వాల, వెలుగు: గద్వాల జిల్లా పెద్దధన్వాడ వద్ద ఇథనాల్‌‌ ఫ్యాక్టరీ వద్దంటూ విధ్వంసానికి పాల్పడిన రైతులకు పోలీసులు బేడీలు వేసి కోర్టుకు తీసుకువచ్చారు. బేడీలు వేసిన ఫొటోలు, వీడియో సోషల్‌‌ మీడియాలో వైరల్‌‌గా మారడంతో ప్రజా, రైతు సంఘాలు, ప్రతిపక్ష నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. ఇథనాల్‌‌ ఫ్యాక్టరీ వద్దంటూ ఈ నెల 4న 12 గ్రామాల ప్రజలు ఫ్యాక్టరీ నిర్మాణ స్థలం వద్ద ఆందోళనకు దిగి విధ్వంసం సృష్టించారు. 

ఈ ఘటనలో పెద్ద ధన్వాడ, చిన్న ధన్వాడకు చెందిన చిన్న నరసింహులు, కొంకల నరసింహ, బోయ భరత్, కురువ చిన్న నాగేంద్ర, కాటం, పరశురాముడు, శివ గౌడ్, తిప్పారెడ్డి, సూర్య ప్రకాష్, కురువ భీమన్న, మనోహర్, మోషన్నలను పోలీసులు అరెస్ట్‌‌ చేసి కోర్టులో హాజరుపరుచగా 14 రోజుల రిమాండ్‌‌ విధించారు. బుధవారం రిమాండ్‌‌ ముగియడంతో అలంపూర్‌‌ కోర్టులో జడ్జి ఎదుట ప్రవేశపెట్టేందుకు మహబూబ్‌‌నగర్‌‌ జైలు నుంచి రైతులను తీసుకొచ్చారు. 

ఈ క్రమంలో ఇద్దరు రైతులకు కలిపి ఒక బేడీ వేసి కోర్టు వరకు తీసుకొచ్చారు. ఈ ఘటనను కొందరు వీడియో తీసి సోషల్‌‌ మీడియాలో పోస్ట్‌‌ చేశారు. వైరల్‌‌గా మారడంతో పలు ప్రజా, రైతు సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు బేడీలు వేసిన విషయంపై ఉన్నతాధికారులు సీరియస్‌‌ అయ్యారు. ఇందుకు బాధ్యులైన ఓ ఆర్‌‌ఎస్సై, ఇద్దరు ఏఆర్‌‌ఎస్సైలను సస్పెండ్‌‌ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యారని ఎస్పీ శ్రీనివాసరావు ప్రకటించారు.

పరామర్శకు వెళ్లిన పౌర హక్కుల నేతలు అరెస్ట్‌‌

రైతులను పరామర్శించేందుకు వెళ్తున్న పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి నారాయణరావు, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఎండి.సుభాన్‌‌ను ఎర్రవల్లి చౌరస్తా వద్ద పోలీసులు అరెస్ట్‌‌ చేసి ఇటిక్యాల స్టేషన్‌‌కు తరలించారు. రైతులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని, అరెస్ట్‌‌ చేసిన పౌర హక్కుల నేతలను వెంటనే రిలీజ్ చేయాలని ప్రజాఫ్రంట్‌‌ నాయకుడు ప్రభాకర్‌‌ డిమాండ్‌‌ చేశారు.

రైతులకు బెయిల్‌‌.. జైలు నుంచి విడుదల

ఇథనాల్‌‌ ఫ్యాక్టరీ వద్ద జరిగిన విధ్వంసం కేసులో అరెస్ట్‌‌ అయిన 12 మంది రైతులు బుధవారం రాత్రి జైలు నుంచి విడుదలయ్యారు. వీరికి మంగళవారం సాయంత్రమే బెయిల్‌‌ మంజూరైనా ష్యూరిటీల వ్యవహారం బుధవారం మధ్యాహ్నం కంప్లీట్‌‌ అయింది. వాటిని జైలు ఆఫీసర్లకు అందించడంతో బుధవారం రాత్రి రిలీజ్‌‌ అయ్యారు.

రైతులకు బేడీలు వేయడం క్షమించరాని నేరం: కేటీఆర్

రైతులకు బేడీలు వేయడం క్షమించరాని నేరం అని బీఆర్‌‌ఎస్‌‌ వర్కింగ్‌‌ ప్రెసిడెంట్‌‌ కేటీఆర్ ఎక్స్‌‌లో మండిపడ్డారు. ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న రైతులకు అక్రమ కేసులు పెట్టి వేధించడమే దారుణమైతే.. వారికి బేడీలు మహాఘోరం అన్నారు. సీఎం రేవంత్‌‌రెడ్డి కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతుందని, వెంటనే రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌‌ చేశారు.