నేటి నుంచి రైతు నేస్తం

నేటి నుంచి రైతు నేస్తం
  • రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్‌‌‌‌ సేవలు ప్రారంభించనున్న సీఎం
  • పాల్గొననున్న  మంత్రి తుమ్మల, ఇతర ప్రజా ప్రతినిధులు
  • సాగులో  టెక్నాలజీని వినియోగించే రైతులతో ముఖాముఖి
  • 32 జిల్లాల్లోని 110 రైతు వేదికల్లో  ఏర్పాట్లు పూర్తి

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా 110 రైతు వేదికల్లో బుధవారం  నుంచి వీడియో కాన్ఫరెన్స్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. మధ్యహ్నం 12 గంటలకు సెక్రటేరియెట్‌‌‌‌ నుంచి సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌‌‌‌రావు ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ ద్వారా  వీడియో కాన్ఫరెన్స్ సేవలను ప్రారంభించనున్నారు.  అనంతరం  రైతులతో  మాట్లాడనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేశారు.

 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాట్లు చేసి రైతులతో నేరుగా ఇంటరాక్ట్ అవ్వాలని వ్యవసాయ శాఖ ఇటీవల నిర్ణయించింది. అందుకు తగినట్లుగా గ్రామాల వారీగా సాగులో టెక్నాలజీ వినియోగిస్తున్న రైతులతో  సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి, మంత్రి తుమ్మల మాట్లాడేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్లు, వ్యవసాయశాఖ అధికారులు కూడా పాల్గొననున్నారు. 

32 జిల్లాల్లో సేవలు..

రాష్ట్రంలో హైదరాబాద్ మినహా 32 జిల్లాల్లోని  రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. మొదటి దశలో భాగంగా  జిల్లాలోని ఏడీఈ స్థాయి అధికారుల పరిధిలోని  రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ సేవలను అందించడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇది విజయవంతమైన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా విడతల వారీగా అన్ని రైతు వేదికలకు సేవలను విస్తరించనున్నారు. 31 రైతు వేదికల్లో గ్రౌండింగ్‌‌‌‌  చేసి ప్రత్యేక సాఫ్ట్ వేర్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ టెస్టింగ్  పూర్తి చేస్తారు. కొత్త టెక్నాలజీ ద్వారా రైతులకు సాగులో సాయపడటంతో పాటు, అధికారులకు కూడా అవగాహన కార్యక్రమాలను నిర్వహించనున్నారు. 

సర్వీసులు ఇవే..

రైతు వేదికల్లో వచ్చే కొత్త టెక్నాలజీతో  వ్యవసాయ,  అనుబంధ శాఖల అధికారులు, శాస్త్రవేత్తలు రైతులతో నేరుగా మాట్లాడి, సాగుపై సలహాలు ఇవ్వనున్నారు. పంటల చీడ పీడలపై రైతులకు సూచనలు, సలహాలు ఇవ్వనున్నారు. ప్రభుత్వం తీసుకువచ్చే కొత్త స్కీములపై రైతులకు అవగాహన కల్పించనున్నారు.  వివిధ శాఖల మంత్రులు కూడా నేరుగా రైతులతో మాట్లాడే వీలు కలుగుతుంది. రైతులు కూడా  తమ సమస్యలను నేరుగా ప్రభుత్వానికి తెలిపే అవకాశం కల్పిస్తారు. 

బ్యాంకర్లు రైతులకు ఇచ్చే రుణాలు, వివిధ స్కీములు వివరించే అవకాశం ఉంది. వ్యవసాయంతో పాటు పశుసంవర్థక శాఖ వెటర్నరీ డాక్టర్లు రైతులకు సలహాలు అందించనున్నారు. రైతు వేదికల్లోని టెక్నాలజీ ద్వారా రైతులతో నేరుగా సమావేశమై ముఖాముఖిగా ప్రతీ సమస్యను అడిగి తెలుసుకుని పరిష్కరించుకునే వీలు కల్పిస్తామని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు.