
- సన్న వడ్లు కొనుగోలు చేయాలని డిమాండ్
కోనరావుపేట, వెలుగు: కొనుగోళ్లలో జాప్యంతో ధాన్యం మొలకెత్తుతుందని అన్నదాతలు రోడ్డెక్కారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కమాన్ వద్ద ప్రధాన రహదారిపై వెంకటరావుపేట రైతులు పురుగుల మందు డబ్బాలతో బైఠాయించి ధర్నా నిర్వహించారు. సెంటర్లలో ధాన్యం పోసి రెండు నెలలు గడుస్తున్నా కొనుగోళ్లు పూర్తి కావడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సన్న వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పిన ప్రభుత్వం మోసం చేస్తోందన్నారు. సన్నాలు కొనుగోలు చేయడం లేదంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.
గ్రామానికి చెందిన ఓ రైతు 5 ఎకరాల్లో సన్నాలను సాగు చేసి కొనుగోలు కేంద్రంలో పోసి 50 రోజులు గడుస్తున్నా ఇంతవరకు తూకాలు వేయడం లేదన్నారు. మిల్లర్లు సన్నాలను దించుకోమని చెబుతున్నారని రైతులు వాపోతున్నారు. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు కొనుగోలు కేంద్రంలోని ధాన్యం మొలకెత్తుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ స్పందించి వెంటనే కొనుగోలు చేసేలా చూడాలని కోరారు.