FASTagపై కేంద్రం సంచలన నిర్ణయం.. రూ.3వేలకే ఏడాది పాటు ట్రిప్స్.. పూర్తి వివరాలు

FASTagపై కేంద్రం సంచలన నిర్ణయం.. రూ.3వేలకే ఏడాది పాటు ట్రిప్స్.. పూర్తి వివరాలు

FASTag annual pass: దేశంలో హైవేలపై ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు ఫాస్టాగ్ టెక్నాలజీని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇది టోల్ ప్లాజాల వద్ద వాహనదారులకు వేచి ఉంచే సమయాన్ని తగ్గించింది. 

అయితే తాజాగా కేంద్ర రోడ్డు రవాణా అండ్ హైవేల మంత్రిత్వ శాఖ ఫాస్టాగ్ పై కీలక ప్రకటన చేసింది. కేంద్ర ప్రకటించిన వార్షిక పాస్ ప్రజలపై భారాన్ని తగ్గించటంతో పాటు వారికి వేగవంతమైన, సులభతరమైన ప్రయాణాన్ని అందిస్తుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తన ఎక్స్ పోస్టులో స్పష్టం చేశారు. అయితే ఇవి కమర్షియల్ వాహనాలకు వర్తించదని చెప్పారు. 

 

ఆగస్టు 15, 2025 నుంచి వార్షికంగా ఫాస్టాగ్ పాస్ కోసం రూ.3వేలు చెల్లిస్తే 200 ట్రిప్స్ ప్రయాణించవచ్చని గడ్కరీ వెల్లడించారు. ఫాస్టాగ్ నాన్ కమర్షియల్ వానహాలకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేశారు కేంద్ర మంత్రి. దీని కింద జీపులు, కార్లు, వ్యాన్ల యజమానులు తమ ప్రయాణాల కోసం వార్షిక పాస్ సౌకర్యాన్ని తక్కువ ఖర్చులో వినియోగించుకోవచ్చు. దీని వ్యాలిడిటీ కొన్నప్పటి నుంచి ఏడాది లేదా 200 ట్రిప్స్ ఏది ముందుగా పూర్తయితే దానిని రవాణా శాఖ పరిగణలోకి తీసుకుంటుందని గడ్కరీ చెప్పారు. 

పాస్ యాక్టివేషన్, రెన్యూవల్ కి సంబంధించిన ప్రక్రియను త్వరలోనే రాజమార్గ్ యాత్ర యాప్, ఎన్ హెచ్ఏఐ వెబ్ సైట్ లో అందుబాటులోకి తీసుకొస్తామని గడ్కరీ చెప్పారు. అలాగే 60 కిలోమీటర్ల లోపు టోల్ ప్లాజాలను కలిగి ఇబ్బంది పడుతున్న చాలా మంది వాహనదారులకు ప్రస్తుతం తీసుకొస్తున్న వార్షిక పాస్ పరిష్కారంగా నిలుస్తుందని గడ్కరీ వెల్లడించారు.