జీడిమెట్ల, వెలుగు: చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన తండ్రీకొడుకులకు మేడ్చల్ ప్రత్యేక పోక్సో కోర్టు జీవిత ఖైదు విధించింది. అలాగే రూ.10 వేల జరిమానాతో పాటు బాధిత చిన్నారికి రూ.5 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. పేట్బషీరాబాద్ సీఐ విజయ్వర్థన్ తెలిపిన వివరాల ప్రకారం.. కర్నాటకలోని గుల్బర్గా ప్రాంతానికి చెందిన శివకుమార్ (43), అతని కొడుకు సాముల్ అలియాస్ సామెల్ (19) ఉపాధి కోసం నగరానికి వచ్చి కొంపల్లిలోని సాయినగర్లో నివాసం ఉంటూ ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నారు.
2023 ఆగస్టు 10న తమ కాలనీలో నివసించే ఓ కుటుంబానికి చెందిన చిన్నారిని ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో శివకుమార్, సాముల్ తమ ఇంటికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు. కూలీ పనులకు వెళ్లిన తల్లిదండ్రులు ఇంటికి వచ్చేసరికి చిన్నారి ఏడుస్తూ కనిపించింది. అనుమానం వచ్చిన తల్లి ఆరా తీయగా జరిగిన విషయం వెల్లడించింది.
బాధిత చిన్నారి తల్లిదండ్రులు పేట్బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ పూర్తి చేసి నిందితులపై చార్జిషీట్ దాఖలు చేశారు. కేసును విచారించిన మేడ్చల్ ప్రత్యేక పోక్సో కోర్టు జడ్జి కె.వెంకటేశ్ నిందితులు శివకుమార్, సాముల్లను దోషులుగా నిర్ధారించి జైలు శిక్ష విధించారు
