పొలం అమ్మకం: కన్న కొడుకును కడతేర్చిన తండ్రి

పొలం అమ్మకం: కన్న కొడుకును కడతేర్చిన తండ్రి

తండ్రి చేతిలో కొడుకు హత్యకు గురైన సంఘటన కేశంపేట మండలం, తూర్పుగడ్డ తండాలో శనివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం తూర్పుగడ్డ తండాకు చెందిన కేతావత్ రాములు, కమలమ్మ భార్యాభర్తలు. వీరికి ఇద్డరు కుమారులు. ఎకరం పొలం ఉంది. తాగుడుకు బానిసైన రాములుకు కుటుంబ సభ్యులతో పొలం అమ్మకం విషయంలో తరచూ గొడవలు జరుగుతున్నాయి. మూడు రోజుల క్రితం పొలం విషయంలో కమలమ్మతో గొడవకు దిగాడు. ఆ సమయంలో కుమారులు అడ్డుకున్నారు. కోపంలో కొడుకులను చంపేస్తానని బెదిరించాడు. అనంతరం కమలమ్మ పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే శనివారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో నిద్రపోతున్న పెద్ద కుమారుడు ఆంజనేయులు(21)ని రాములు గొడ్డలితో నరికాడు. తీవ్ర గాయాలపాలై మృతి చెందాడు. కమలమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కేశంపేట ఎస్ఐ కోన వెంకటేశ్వర్లు తెలిపారు.