మిథాలీ రాజ్.. రెండు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్లో ఎన్నో ఘనతలు సాధించిన లెజెండరీ క్రికెటర్. తన ఆటతో దేశ మహిళా క్రికెట్కే ముఖ చిత్రంగా మారిన మన హైదరాబాదీ ఆణిముత్యం. క్రికెటర్గా, కెప్టెన్గా ఎన్నో మైలురాళ్లు దాటిన మిథాలీ..వరల్డ్కప్ మాత్రం అందుకోలేకపోయింది. రెండుసార్లు (2005, 2017) జట్టును ఫైనల్ వరకూ తీసుకెళ్లినా ఆమె కల సాకారం కాలేదు. ఇప్పటికే టీ20లకు గుడ్బై చెప్పిన ఈ లెజెండ్.. వచ్చే ఏడాది జరిగే వన్డే ప్రపంచకప్పై కన్నేసింది. ఇండియాను విశ్వవిజేతగా నిలపాలన్న తన లక్ష్యాన్ని నెరవేర్చుకునేందుకు ఇదే అఖరి అవకాశం అంటోంది. అందుకోసం 2018 నుంచి సిద్ధమవుతున్నానని తెలిపింది. టీ20 వరల్డ్కప్లో బౌలర్ల టాలెంట్ వల్లే ఇండియా ఫైనల్ చేరిందని చెప్పింది. కరోనా తర్వాత ఆటలో కొన్ని మార్పులు వస్తాయని, గ్రౌండ్లో కూడా ఫిజికల్ డిస్టెన్స్ పాటించాల్సి వస్తుందని అభిప్రాయపడింది. లాక్డౌన్ కారణంగా ప్రస్తుతం హైదరాబాద్లోని తన ఇంటికే పరిమితమైన మిథాలీని ‘వీ6–వెలుగు’ పలకరించింది. తన కెరీర్, లాక్డౌన్ ఎక్స్పీరియన్స్పై ఈ ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించింది.
ప్రస్తుతానికి నా గోల్ 2021 వన్డే వరల్డ్ కప్. ఈ టోర్నీలో ఆడాలని 2018 నుంచి నన్ను నేను మానసికంగా సిద్ధం చేసుకుంటున్నా. ఇండియాకు వరల్డ్కప్ అందించాలన్నది నా లక్ష్యం. అందుకు నాకది చివరి చాన్స్ కానుంది. అందువల్ల ఏడాదిన్నర నుంచి దీనిపైనే దృష్టి సారించా. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో లాక్డౌన్ ఉండడంతో క్రికెటర్ల ప్రిపరేషన్స్కు చాలా తక్కువ సమయం ఉంటుంది. ఈ విషయంలో ఎవ్వరికీ మినహాయింపు ఉండదు. కానీ, ఏ టీమ్ తొందరగా తమ స్కిల్ వర్క్ను, ప్రిపరేషన్స్ను స్టార్ట్ చేస్తుందో ఆ టీమ్కు వరల్డ్ కప్లో బెటర్ చాన్స్ ఉంటుంది.
కాన్ఫిడెన్స్ పెంచింది
టీ20 వరల్డ్ కప్లో ఇండియా ఓడిపోయింది .కానీ, ఫస్ట్ టైమ్ ఫైనల్కు రావడం టీమ్లో కచ్చితంగా కాన్ఫిడెన్స్ పెంచింది. టోర్నీ గ్రూప్ స్టేజ్లో బౌలర్లు బాగా ఆడారు. కానీ, బ్యాటర్ల నుంచి వరల్డ్కప్ స్థాయికి అవసరమైన పెర్ఫామెన్స్ రాలేదు. ఒక్క షెఫాలీ వర్మ మాత్రమే ఆకట్టుకుంది. 16 ఏళ్ల ఆ అమ్మాయి ఒక్కతే ప్రతి మ్యాచ్లో దాదాపు 30 రన్స్ వరకూ చేసింది.సాధారణంగా ఒక టీమ్ను సింగిల్ హ్యాండెడ్గా గెలిపించాలంటే 30 రన్స్ స్కోరు సరిపోదు.అంతకంటే ఎక్కువ కావాలి. కనీసం ఒక్కరైనా 50, 70, 80 రన్స్ చేయాలి. కానీ, మన బ్యాటింగ్ డిపార్ట్మెంట్ అంచనాలను అందుకోలేకపోయింది. బౌలర్ల ప్రతిభ వల్లే టీమ్ ఫైనల్ వరకూ
రాగలిగింది.
‘వైట్ మొఘల్స్’ బుక్ చదువుతున్నా
లాక్డౌన్ నేపథ్యంలో ఇంటికే పరిమితమైనా నేను వంట గదిలోకి వెళ్లడం లేదు. వంట మొత్తం మా మమ్మీనే చూసుకుంటుంది. నేనేమీ హెల్ప్ చెయ్యడం లేదు. పెయింటింగ్, స్కెచెస్ విషయంలో మా నీస్ (కోడలు)కు హెల్ప్ చేస్తున్నా. అలాగే, నెట్ఫ్లిక్స్లో కొన్ని ఫాంటసీ జానర్ సినిమాలు చూస్తున్నా. నేను పుస్తకాలు బాగా చదువుతా. ప్రస్తుతం ‘వైట్ మొఘల్స్’ అనే బుక్ చదువుతున్నా. మొఘల్ ఎరాలో మన హైదరాబాద్ ఎలా ఉండేదో పుస్తకంలో చాలా డెప్త్గా వివరించారు. గోల్కొండ మైన్స్ గురించి, మొఘల్స్ మన హైదరాబాద్ను ఎలా రూల్ చేయాలని అనుకున్నారు, ఆ టైమ్లో మన సిటీ ఎలా ఉండేది అనే విషయాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి.
సెలబ్రేషన్స్ పై క్రియేటివ్గా ఆలోచించాలి
లాక్డౌన్ ముగిసిన తర్వాత కూడా ప్రజల్లో కొంత భయం ఉంటుంది. వ్యాక్సిన్ వచ్చే వరకూ ప్రతి ఒక్కరిలో అనుమానాలు ఉంటాయి. ఇలా సమాజంలో అనేక రకాల మార్పులు కనిపిస్తాయి.వీటిపై నేను మా టీమ్మేట్స్తో కూడా డిస్కస్ చేశా. సాధారణంగా మేం వికెట్ తీసినప్పుడు హై ఫైవ్స్ ఇచ్చుకొని, హగ్స్ చేసుకొని సెలబ్రేట్ చేసుకుంటాం. కానీ, ఇకపై ఇవి కనిపించకపోవచ్చు. బాడీ కాంటాక్ట్ విషయంలో చాలా మంది అప్రమత్తంగా ఉంటారు. బహుశా గ్రౌండ్లో కూడా మేం ఫిజికల్ డిస్టెన్స్ పాటించాల్సి రావొచ్చు. అప్పుడు వికెట్ పడ్డప్పుడు వేరే రకంగా సెలబ్రేట్ చేసుకోవాలి. అందుకోసం మేం క్రియేటివ్గా ఆలోచించాలి.
కోచింగ్పై.. రిటైరయ్యాకే నిర్ణయం
రిటైరయ్యాక కోచింగ్ వైపు వస్తానో లేనో ఇప్పుడే చెప్పలేను. ప్రస్తుతానికి ఫ్యూచర్ ప్లాన్స్ ఏమీ లేవు. ఈ లాక్డౌన్ టైమ్లో ఫిట్గా ఉండేందుకు ప్రయత్నిస్తున్నా. నా బ్యాటింగ్ స్కిల్స్పై వర్క్ చేస్తున్నా. రిటైర్మెంట్ తీసుకునే టైమ్కు ఫ్యూచర్ కోసం ఎలాంటి మార్గాలు నా ముందు ఉంటాయో చూడాలి. అప్పుడే ఏదైనా నిర్ణయం తీసుకుంటా.