ఓయో హోటల్ లో ఫైర్ యాక్సిడెంట్

ఓయో హోటల్ లో ఫైర్ యాక్సిడెంట్

ఎల్ బీనగర్, వెలుగు: ఓయో హోటల్ లో అగ్ని ప్రమాదం జరిగిన ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. మరో 16 మందిని ఫైర్ సిబ్బంది రక్షించారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. చైతన్యపురి పోలీసులు,ఫైర్ ఆఫీసర్ శీనయ్య తెలిపిన ప్రకారం.. కొత్తపేట మోహన్ నగర్ లోని ( వెంకటేశ్వర అతిథి) ఓయో హోటల్ లో శుక్రవారం తెల్లవారుజామున 3:20 గంటల సమయంలో కౌంటర్ రూమ్ వద్ద షార్ట్ సర్క్యూట్ తో  ఒక్కసారిగా భారీ పొగతో మంటలు వ్యాపించాయి. దీంతో స్థానికులు చూసి ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. 

కాగా మంటల వ్యాప్తితో ఓ రూమ్ లోని ఓ యువతి, యువకుడు రెండో అంతస్తు నుంచి కిటికి ద్వారా మొదటి అంతస్తుకు వచ్చి పక్కన రేకుల షెడ్డుపై దూకారు. దీంతో యువతి కాళ్లకు గాయాలవగా ఆస్పత్రికి తరలించారు. ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పేసి హోటల్ రూమ్ లలో చిక్కిన16 మందిని రక్షించారు. ఓయో హోటల్ నిర్వాహకులు ఎలాంటి ఫైర్ సేఫ్టీ లేకుండా నిర్వహిస్తున్నారని బాధిత యువకుడు సంజు పోలీసులకు కంప్లయింట్ చేయగా కేసు నమోదు చేశారు. గతేడాది ఇదే సమయంలో ఎల్ బీనగర్ లోని ఓయో హోటల్ లో ఇలాంటి ఘటనే జరిగింది. .