
- పేషెంట్స్ లేకపోవడంతో తప్పిన ప్రాణనష్టం
బషీర్బాగ్, వెలుగు: నారాయణగూడలోని ఎక్సెల్ హాస్పిటల్లో గురువారం అగ్నిప్రమాదం సంభవించింది. హాస్పిటల్లో పేషెంట్స్ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. డిస్టిక్ ఫైర్ ఆఫీసర్ వెంకన్న వివరాల ప్రకారం.. ఐదంతస్తుల బిల్డింగ్లో మొదటి , రెండు అంతస్తుల్లో ఎక్సెల్ హాస్పిటల్ నిర్వహిస్తుండగా, పైనున్న మూడు అంతస్తుల్లో డాక్టర్స్ ఫ్యామిలీ ఉంటున్నారు. హాస్పిటల్ లోని మొదటి అంతస్తులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.
హాస్పిటల్ సిబ్బంది అప్రమత్తం చేయడంతో డాక్టర్ల ఫ్యామిలీ మెంబర్లు కిందకు దిగారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పివేశారు. బిల్డింగ్ లో పొగ నిండిపోవడంతో విండోస్ బ్రేక్ చేశారు. హాస్పిటల్లో ఎలాంటి ఫైర్ సేఫ్టీ లేదని అధికారులు తెలిపారు.
షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు. ప్రమాదంలో మొదటి అంతస్తులో ఫర్నిచర్ , ఏసీ ఇతర సామగ్రి అగ్నికి ఆహుతయ్యాయి. సుమారు రూ.30 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లిందని బిల్డింగ్ యజమాని తెలిపారు.