బాలీవుడ్ నటులు రణ్బీర్ కపూర్, శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ఓ మూవీ సెట్లో అగ్ని ప్రమాదం జరిగింది. శుక్రవారం జరిగిన ఈ ఘటనలో ఒకరు మరణించగా.. మరొకరు గాయపడినట్టు సమాచారం. మహారాష్ట్రలోని ముంబయి శివారు అంధేరి వెస్ట్ ప్రాంతంలో ఉన్న చిత్రకూట్ మైదానంలో వేసిన సినిమా సెట్టింగులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, మరొకరు గాయపడ్డారు. ఈ ఘటన సాయంత్రం 4.30 గంటలకు జరిగినట్టు తెలుస్తోంది. మంటలను అదుపులోకి తెచ్చేందుకు ఎనిమిది ఫైర్ ఇంజిన్లు, అయిదు నీటి జెట్టీలతో సిబ్బంది శ్రమించారు.
ఈ సెట్టింగుల్లో ఒకచోట రాజశ్రీ ప్రొడక్షన్స్ చిత్రం, మరోచోట డైరక్టర్ లవ్ రంజన్ దర్శకత్వంలో రణ్బీర్- శ్రద్ధా హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న కొత్త మూవీ చిత్రీకరణలు జరుగుతుండగా అగ్గి రాజుకొన్నట్లు ఫెడరేషన్ ఆఫ్ వెస్టర్న్ ఇండియా సినీ ఎంప్లాయీస్ ప్రధాన కార్యదర్శి అశోక్ దూబే తెలిపారు. ఈ ప్రమాదంలో మనీశ్ దేవాశీ (32) అనే యువకుడు తీవ్రంగా గాయపడగా... వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినప్పటికీ... అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. అయితే రణ్బీర్, శ్రద్ధా.. స్పెయిన్లో సినిమా షూటింగ్ షెడ్యూల్ను ముగించుకుని ఇటీవలే ముంబయి వచ్చారు. ఈ చిత్రంలో బోనీ కపూర్, డింపుల్ కపాడియా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాగా 2023 మార్చి 8న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.