
మిర్యాలగూడ, వెలుగు: రాష్ట్రంలోనే తొలిసారిగా వైర్ లెస్ ఇరిగేషన్ ఆటోమేషన్ సిస్టమ్ ను ఏర్పాటు చేశామని నల్గొండ జిల్లా ఉద్యానవన, పట్టు పరిశ్రమశాఖ అధికారి అనంతరెడ్డి తెలిపారు. మాడుగులపల్లి మండలం ఇందుగులలో రైతు మంత్రాల వెంకటరెడ్డికి చెందిన 12 ఎకరాల పామాయిల్ తోటలో మంగళవారం (జూన్ 17) ఆటోమేషన్ సిస్టమ్ ను ఏర్పాటు చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు.
ఈ సిస్టమ్ ద్వారా తోటకు అందించాల్సిన ఎరువులు, నీటిని ఆటోమేటెడ్ డ్రిప్ తో బిందు సేద్య విధానంలో 365 రోజులు మొక్కలకు నీళ్లు, ఎరువులను అందజేయవచ్చని చెప్పారు. మొక్కలకు వాల్స్, మోటార్లు, కూలీలు అవసరం లేకుండా మొబైల్ యాప్ ద్వారా కంట్రోల్ చేయొచ్చని పేర్కొన్నారు.
టైమర్ సెట్ చేసుకుంటే ఆటోమేటిక్ గా ఆన్ ఆఫ్ అవుతుందని చెప్పారు. ప్రభుత్వ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మొబిటెక్ ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రతినిధి సంగీత్ రెడ్డి, నెటాఫిమ్ టెక్నాలజీ నిపుణులు శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు.