- ఉమ్మడి వరంగల్లో ఇద్దరు.. నల్గొండ,
- నారాయణపేట, కామారెడ్డిలో ఒక్కరు చొప్పున..
- విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యమే కారణం
వెలుగు, నెట్వర్క్: రాష్ట్రంలో ఆదివారం వేర్వేరు చోట్ల కరెంట్ షాక్తో ఐదుగురు రైతులు చనిపోయారు. వానాకాలం సాగుకు రెడీ అవుతున్న టైంలో కరెంటోళ్ల నిర్లక్ష్యానికి బలయ్యారు. హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం వంగపహాడ్కు చెందిన కన్నబోయిన సాంబయ్య (38) ఆరేపల్లి శివారులో 10 ఎకరాల భూమిని కౌలు తీసుకుని సాగు చేస్తున్నాడు. పొద్దున నారుమడికి నీళ్లు పెట్టేందుకు వెళ్లాడు. అక్కడ ప్రమాదవశాత్తు కరెంట్ వైర్లు తగలడంతో షాక్ కొట్టి స్పాట్లోనే చనిపోయాడు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం కడారిగూడెం గ్రామానికి చెందిన శిరంశెట్టి రవీందర్రావు (59) పొలానికి నీళ్లు పెట్టేందుకు కొడుకు రాజ్కుమార్తో కలిసి వెళ్లాడు. కరెంట్ సప్లై కాకపోవడంతో రవీందర్రావు సమీపంలోనే ఉన్న ట్రాన్స్ఫార్మర్ వద్దకు వెళ్లి ఆఫ్ చేసేందుకు యత్నించాడు. ఈ క్రమంలో కరెంట్ షాక్ కొట్టి చనిపోయాడు. నారాయణ పేట జిల్లా మద్దూరు మండలంలో ఆదివారం కరెంట్ షాక్ తో రొయ్యల రాంచంద్రప్ప (60) అనే రైతు చనిపోయాడు. అదే గ్రామానికి చెందిన చౌబన్ రాఘవేందర్ దగ్గర ఆరెకరాల భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. ఆదివారం ఉదయం 9 గంటల ప్రాంతంలో చేనుకు వెళ్లిన రాంచంద్రప్ప నీళ్లు పెడుదామని స్టార్టర్ ఆన్ చేస్తుండగా పక్కనే ఉన్న వైరు తగిలి షాక్ కొట్టింది. అక్కడే పడిపోవడంతో పక్కనున్న వారు గమనించి దవాఖానకు తరలిస్తుండగా చనిపోయాడు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం కాకుల గుట్ట తండాకు చెందిన రైతు భూక్య భాస్కర్(37) కరెంట్పోల్పై నుంచి కిందపడి చనిపోయాడు. భాస్కర్తన వ్యవసాయ బావి వద్ద ఉన్న కరెంట్ కనెక్షన్ సర్వీస్ వైర్ సరిగ్గా పని చేయడం లేదని కరెంట్పోల్ఎక్కి సరిచేస్తున్నాడు. ప్రమాదవశాత్తు జారి కింద ఎండిపోయి ఉన్న చెట్టు కొమ్మపై పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. ట్రీట్మెంట్ కోసం అతడిని కుటుంబసభ్యులు సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలోని ప్రైవేట్ హాస్పిటల్కు తీసుకెళ్లగా చికిత్స పొందుతూ చనిపోయాడు. నల్గొండ జిల్లా మేళ్లచెరువు మండలం శివబాలాజీనగర్ తండాకు చెందిన బానోతు చంద్రియా(65) అనే రైతు తన పొలంలో పనులు చేస్తున్నాడు. కరెంట్ పోల్ నుంచి నేలపై పడి ఉన్న కరెంట్ తీగను గమనించకపోవడంతో అది తగిలి షాక్ తో చనిపోయాడు. మృతుడి భార్య మోతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కాగా, కరెంట్ తీగ వేలాడుతోందని ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్లినా స్పందించలేదని కుటుంబసభ్యులతో పాటు చుట్టుపక్కల రైతులు ఆరోపించారు.