చెన్నారెడ్డి సేవలు మరువలేనివి : కె.లక్ష్మణ్

చెన్నారెడ్డి సేవలు మరువలేనివి : కె.లక్ష్మణ్

ముషీరాబాద్, వెలుగు: ఉమ్మడి ఏపీ మాజీ సీఎం మర్రి చెన్నారెడ్డి సేవలు మరువలేనివని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు కె. లక్ష్మణ్ అన్నారు.  మర్రి చెన్నారెడ్డి 26వ వర్ధంతిని శుక్రవారం ఇందిరా పార్క్ లోని రాక్ గార్డెన్​లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లక్ష్మణ్​ పాల్గొని మాట్లాడారు. చెన్నారెడ్డి ఆ రోజుల్లోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు శ్రీకారం చుట్టారని, కానీ ఇప్పుడు కొంతమంది తామే ఉద్యమాలు చేశామని గొప్పలు చెప్పుకుంటూ వారికి వారే తెలంగాణ జాతిపితగా చెలామణి అవుతున్నారని విమర్శించారు. మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్ మాట్లాడుతూ.. తెలంగాణ కోసం ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో మొదట కొట్లాడిన వ్యక్తి మర్రి చెన్నారెడ్డి అని అన్నారు. ఆయన ఆకాంక్షలను నెరవేర్చడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు.

మర్రి శశిధర్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడింది కానీ.. తన తండ్రి చెన్నారెడ్డి కలలు నెరవేరలేదన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా ముందుకు వెళ్తామని తెలిపారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్​జోషి, డీకే అరుణ, మాజీ ఎంపీలు బూర నర్సయ్య గౌడ్, కొండ విశ్వేశ్వర్ రెడ్డి, పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎమ్మెల్యేలు కూన శ్రీశైలం గౌడ్, కృష్ణ యాదవ్ తదితరులు పాల్గొని చెన్నారెడ్డికి నివాళి అర్పించారు.