టీఆర్​ఎస్​ టికెట్​ ఇవ్వకున్నా పోటీలో ఉంటా 

టీఆర్​ఎస్​ టికెట్​ ఇవ్వకున్నా పోటీలో ఉంటా 

నేలకొండపల్లి, వెలుగు: బీజేపీ, కాంగ్రెస్​ ఢిల్లీ లీడర్లు తనతో టచ్ లోనే ఉన్నారని ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. ప్రస్తుతం తాను గులాబీ తోటలోనే ఉన్నానని, ఈ తోటలో పువ్వు దొరుకుతుందా లేదా అనేది చూడాలంటూ పరోక్షంగా వచ్చే ఎన్నికల్లో టికెట్​ గురించి వ్యాఖ్యానించారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలో గురువారం పలు కార్యక్రమాలకు హాజరైన ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాజకీయాల్లో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి జోక్యం ఉండదని, తనకు ఆయన ఎలాంటి రాజకీయ సలహాలు ఇవ్వరని తేల్చిచెప్పారు. ఎంపీగా ఉన్నప్పుడు ప్రజల మధ్యలో ఉన్నానని, పదవి లేకపోయినా ప్రజల మధ్యే ఉంటున్నానని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజా తీర్పును వదులుకొనే ప్రసక్తే లేదన్నారు. ఇప్పటివరకు సీఎం  కేసీఆర్, కేటీఆర్ ఎక్కడి నుంచి పోటీ చేయాలో తనకు చెప్పలేదన్నారు. టీఆర్ఎస్ తనకు అవకాశం ఇస్తుందని ఆశిస్తున్నానని, ఒకవేళ ఇవ్వకపోయినా ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు.