
కాంగ్రెస్ పార్టీ మూడు నెలల్లో అధికారం కోల్పోతుందంటూ మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి జోస్యం చెప్పారు. వచ్చే పార్లమెంటు ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని కార్యకర్తలను కోరారు. బెల్లంపల్లి టౌన్ లో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రశాంత్ రెడ్డి..కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజా దర్బార్ కు సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నారా.. ఇప్పుడు చూపిస్తారా అని మీడియాను ప్రశ్నించారు. అధికారులు కొందరు తమ పార్టీ కార్యకర్తలను వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అధికారులు ఒళ్లు దగ్గర పెట్టుకుని అందరిని సమానంగా చూడాలని హెచ్చరించారు.
రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లే ప్రయత్నంలో పార్టీ కార్యకర్తలని పట్టించుకోలేదనేది వాస్తవమన్నారు. కార్యకర్తలను, నాయకులను భాగస్వామ్యం చేయకుండా అంతా ఆన్ లైన్లో నడిపించడం కూడా తమ పార్టీ ఓటమికి కారణమన్నారు. కొన్ని పథకాలు తమ కొంప ముంచాయన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ జోడో యాత్ర చేస్తుంటే.. ఇండియా కూటమి నుంచి నేతలు వదిలిపెట్టి పోతున్నారని ఎద్దేవా చేశారు.