లండన్ లోని ఇండియా యూకె అచీవర్స్ హానర్స్ భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(90)కు జీవితకాల సాఫల్య గౌరవాన్ని ప్రకటించింది. ఆర్థిక, రాజకీయ రంగాల్లో ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా భారత్ -బ్రిటన్ విజేతల సంఘం ఈ అవార్డుకు మన్మోహన్ సింగ్ ను ఎంపిక చేసింది. బ్రిటన్లోని భారత విద్యార్థులు, పూర్వ విద్యార్థుల సంఘం(ఎన్ఐఎస్ఏయూ) త్వరలోనే ఢిల్లీలో మన్మోహన్కు ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు.
బ్రిటిష్ యూనివర్శిటీల్లో చదువుకుని జీవితంలో ఘన విజయాలు సాధించిన భారతీయులకు లైఫ్టైమ్ ఎచీవ్మెంట్ పురస్కారం ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. ఎన్ఐఎస్ఏయూ బ్రిటిష్ కౌన్సిల్ ఇన్ ఇండియా, డిపార్టుమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ ట్రేడ్ (డిఐటి) భాగస్వామ్యంతో ఇండియా యూకె అచీవర్స్ హానర్స్ ఈ అవార్డును ఇవ్వబోతోంది. భారతదేశ భవితకు సారథులైన యువత నుంచి ఈ గౌరవం పొందడం తనను ఎంతో కదిలిస్తోందని మన్మోహన్ ఓ సందేశంలో పేర్కొన్నారు.